గజ్వేల్, జనవరి 22 : అన్నివర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో వరదనీటి కాల్వ, ఈద్గా అభివృద్ధి, గజ్వేల్లో విద్యుత్శాఖ డివిజన్ కార్యాలయ నిర్మాణాలకు శనివారం మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆడపడుచుల పెండ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి ఇంత గొప్ప పథకాలు ఏ రాష్ట్రం అమలు చేయడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రతి పేదింటి ఆడపడుచుకు తల్లిదండ్రులు సంతోషంగా పెండ్లి చేస్తున్నారన్నారు. 333 మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశామన్నారు. అనంతరం ఐవోసీ ప్రాంగణంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు పోచంపల్లి ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ గ్యాస్ ధర రూ.400 ఉన్నప్పుడే బీజేపీ నాయకులు ధర్నాలు చేశారన్నారు. ఇప్పుడు రెట్టింపు స్థాయిలో గ్యాస్, పెట్రో, డీజిల్ ధరలు పెంచారని విమర్శించారు. పేదలపై బీజేపీ ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపిందన్నారు. అన్ని ధరలు పెంచి పేదలను పీల్చిపిప్పి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తలో సబ్సిడీ అంటూ ఖాతాలో జమ చేస్తామన్నారని, ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న గుజరాత్లో అంగన్వాడీ టీచర్లకు కేవలం రూ.7500 వేతనం మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు రూ.4 వేలు, ఆయాలకు రూ.2 వేల వేతనం ఉండేదని, ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు రూ.13,500, ఆయాలకు రూ.7800 వేతనం చెల్లిస్తున్నామన్నారు. పేదలు, చిరుద్యోగులపై సీఎం కేసీఆర్కు ఎంతో ప్రేమ ఉందన్నారు. ప్రజలంతా అన్నం పెట్టే చెయ్యేదో, సున్నం పెట్టే చెయ్యేదో గుర్తించి టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి అండగా నిలవాలన్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్కు ప్రాతినిథ్యం వహించడంతో గజ్వేల్ పట్టణంతో పాటు నియోజకవర్గ రూపురేఖలే మారిపోయాయన్నారు. అప్ప ట్లో పాడుబడ్డ పట్టణంగా కనిపించిన గజ్వేల్ ,ఇప్పుడు అభివృద్ధిలో వందేళ్లు ముందుకు వెళ్లినట్లు అద్భుతంగా కనిపిస్తున్నదని తెలిపారు. ఇదంతా ప్రజలు గుర్తించాలన్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ పాలన చేస్తూ, అభివృద్ధి చేస్తున్నారన్నారు. అనంతరం గజ్వేల్ ‘గడా’ సమావేశ మందిరంలో కల్యాణలక్ష్మి చెక్కులు, ప్రమాదవశాత్తు మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలకు బీమా చెక్కులు అందజేశారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, మున్సిపల్ వైస్ చైర్మన్ జకియొద్దీన్, కౌన్సిలర్లు, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశంగౌడ్,‘గడా’ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, సీడీపీవో వెంకటరాజమ్మ, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, పీఆర్, విద్యుత్ డీఈఈలు అజయ్, శ్రీనివాసచారి, ఏఈ లు, ఇతర అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.