జడ్చర్ల టౌన్, జనవరి 13 : కంటైనర్ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టెబోయిన్పల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి-44పై చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. బస్సులోని మరో ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. జ డ్చర్ల సీఐ రమేశ్బాబు కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూ ర్ జిల్లా సత్యవేడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం సాయం త్రం 4 గంటలకు తిరుపతి మీదుగా హైదరాబాద్కు బయలుదేరింది. గురువారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో జడ్చర్ల మండలం చిట్టెబోయిన్పల్లి గ్రామ శివారులోని హైవేపై ముందు పార్శిల్లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీని ఓవర్టెక్ చేసే యత్నంలో బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. బస్సు డ్రైవర్ ఏ.చిట్టిబాబు (49) బస్సు స్టీరింగ్లోనే ఇరుక్కుని మృతి చెందా డు. మరో డ్రైవర్ మహేశ్వర్తోపాటు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సికింద్రాబాద్కు చెందిన నల్లగుట్ట శ్రీను, కడప జిల్లా రాయచోటికి చెందిన ఆంజనేయులు, మీసాల భాగ్యమ్మ, భారతి, వంశీ, కడపకు చెందిన సబరేశ్వర్, సాహితి, కృతిక్విహాన్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుర్తించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో మహబూబ్నగర్ జిల్లా దవాఖానాకు తరలించారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల సీఐ రమేశ్బాబు, ఎస్సై శంషొద్దీన్ ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఇరుక్కున్న డ్రైవర్ను జేసీబీ సాయంతో బయటకు తీశారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న బస్సు, కంటైనర్ను తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చిత్తూర్ జిల్లా పిచ్చాటూర్ మండలం నీరువాయి గ్రామానికి చెందిన చిట్టిబాబు సత్యవేడు డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బుధవారం సాయంత్రం ఇద్దరు డ్రైవర్లతో బయలుదేరిన బస్సును మొదటగా మహేశ్వర్ సత్యవేడు నుంచి కర్నూల్ వరకు బస్సు నడిపించాడు. ఆ తర్వాత కర్నూల్ నుంచి బస్సు డ్రైవింగ్ చిట్టిబాబు చేశాడని ప్రయాణికులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులతోపాటు సత్యవేడు డిపో మేనేజర్ సుధాకర్రావు జడ్చర్ల దవాఖానలోని మార్చురీకి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు.