చౌటుప్పల్ రూరల్, జనవరి 16 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండా వెళ్తున్న 65వ జాతీయ రహదారిపై శని, ఆదివారాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదాలు సంక్రాంతి పండుగ పూట పలువురి కుటుంబాల్లో విషాదం నింపాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి యూటర్న్ తీసుకుంటున్న ఇన్నోవా కారును హైదరాబాద్ బీహెచ్ఈఎల్ నుంచి మంచిలీపట్నం వెళ్తున్న ఆర్టీసీ గరుడా బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న హైదరాబాద్ కార్వాన్లోని కనకదుర్గాకాలనీకి చెందిన చిప్ప సాయి పృథ్వీరాజ్(23), జవహర్నగర్కు చెందిన వనబోజు చెందు(28) అక్కడికక్కడే మృతిచెందారు. వీరి స్నేహితులు హైదరాబాద్కు చెందిన శివరాజు గోపాల్చారి, అద్దాల కార్తీక్, కె.గణేశ్, అమర్, కారు డ్రైవర్ రాహుల్ గాయపడ్డారు. వీరంతా పనిపై నల్లగొండ జిల్లా చిట్యాలకు వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
ఖమ్మం జిల్లా కొనిజెర్ల మండలం గుబ్బగుర్తి గ్రామానికి చెందిన చెరుకూరి సాయిరాం(28), సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన చెన్నగోని సతీశ్(25) నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామ పరిధిలోని హెరిన్ల్యాబ్లో పని చేస్తూ చౌటుప్పల్ పట్టణంలో నివాసముంటున్నారు. శనివారం రాత్రి విధులు ముగించుకొని బైక్పై ఇంటికి వస్తుండగా అంకిరెడ్డిగూడెం గ్రామపరిధిలోని దివీస్ పరిశ్రమ సమీపంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దాంతో తలకు తీవ్ర గాయాలై వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
బైక్ను కారు ఢీకొని..
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన వాయిలపల్లి సాయిలు(50), కొడుకు నాగరాజుతో కలిసి ఆదివారం తెల్లవారుజామున బైక్పై రంగారెడ్డిజిల్లా మంచాలలోని బంధువుల ఇంటికి బయలుదేరాడు. దివీస్ పరిశ్రమ సమీపంలోకి రాగానే వెనుక నుంచి కారు ఢీకొట్టింది. సాయిలు అక్కడికక్కడే మృతిచెందగా నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ దవాఖానకు తరలించారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి మృతదేహాలను పోలీసులు చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రభుత్వ దవాఖాన వద్ద మృతుల బంధువుల రోదనలతో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంక్రాంతి పండుగ పూట పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. సీఐ ఎన్.శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
బొత్తలపాలెం వద్ద
దామరచర్ల : మండలంలో బొత్తపాలెం వద్ద నార్కట్పల్లి-అద్దంకి ప్రధానరహదారిపై శనివారం బైక్ను కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని రాళ్లవాగుతండాకు చెందిన ధీరావత్ హచ్చు(55) ఆంధ్రాలోని బట్టుపాలెంలో తన అక్క దినానికి హాజరయ్యేందుకు బైక్పై బయలుదేరాడు. బొత్తలపాలెం గ్రామ శివారులో దామరచర్ల వైపునకు వెళ్తున్న కారు బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. దాంతో కింద పడిపోయిన హచ్చు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వాడపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.