వనపర్తి/వనపర్తి రూరల్, జనవరి 16 : గూడులేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందు కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట సమీపంలో, మండలంలోని రాజపేట గ్రామ శివారులో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు ఇల్లు అనేది ఓ కలగా మిగిలిపోవద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ వీటిని నిర్మించి అందిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన ఇండ్ల నిర్మాణంలో పూర్తి నాణ్యత పాటించాలని, పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇండ్లు లేని వారికే వీటిని పారదర్శకంగా విడుతల వారీగా అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందొద్దని, విడుతల వారీగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. అనంతరం రాజపేట గ్రామంలో మంత్రి పర్యటించి ప్రజ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పీర్లగుట్ట వద్ద ఇండ్లకు వెళ్లే రహదారి 40 ఫీట్లుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇలా చేస్తే భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని సూచించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు విభూతి నారాయణ, కంచెరవి, నక్క రాములు, నాగన్న, రాజపేట, పెద్దతండా సర్పంచులు జ్యోతి, జయరాములు, టీఆర్ఎస్ వనపర్తి పట్టణాధ్యక్షుడు రమేశ్గౌడ్, నాయకులు మాధవరెడ్డి, సుదర్శన్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి ప్రజలు పాల్గొన్నారు.
అభివృద్ధి నిరంతర ప్రక్రియ
పెబ్బేరు రూరల్, జనవరి 16 : నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియలా సాగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం పెబ్బేరు మండలం పాతపల్లి-చింతలకుంట హనుమాన్ ఆలయం మధ్య రూ. 10 లక్షల నియోజకవర్గ అభివృద్ధి నిధులతో నిర్మించిన వంతెనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల మౌలిక వసతుల కల్పనకు నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. అనంతరం ఆయన చింతలకుంట ఆంజనేయస్వామి జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, సర్పంచ్ రవీందర్ నాయుడు, నాయకులు వెంకటయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఉత్సవాలు
ప్రతి యేటా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పాతపల్లి సమీపంలోని చింతలకుంట ఆంజనేయస్వామి ఆలయంలో జరిగే జాతర ఉత్సవాలు ఈసారి కూడా ఘనంగా జరిగాయి. మాంసాహారమే నైవేద్యంగా స్వీకరించే హనుమాండ్లను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. మేకలు, కోళ్లతో మొక్కులు తీర్చుకున్నారు.