ముక్కోటి ఏకాదశి వేడుకలను గురువారం కొవిడ్ నిబంధనల నడుమ సాదాసీదాగా నిర్వహించారు. వేములవాడ, ధర్మపురి, కొండగట్టు ఆలయాలతో పాటు కరీంనగర్లోని మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి, అన్ని ప్రముఖ ఆలయాల్లో ఆంతరంగికంగానే వేడుకలు జరిగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఉత్తరద్వార దర్శనం కల్పించారు. అనంతరం ముక్కోటి ఏకాదశి ప్రాశస్థ్యాన్ని పండితులు వివరించారు.
ధర్మపురి/వేములవాడ టౌన్/మల్యాల/కమాన్ చౌరస్తా, జనవరి 13: ముక్కోటి ఏకాదశి వేడుకలు ఉమ్మడి జిల్లాలో నిరాడంబరంగా జరిగాయి. కొవిడ్ నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో కొంతమంది అర్చకులతో ఆంతరంగికంగానే వేడుకలను నిర్వహించారు. పల్లకీలో శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి, లక్ష్మీసమేత అనంతపద్మనాభ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనానంతరం, పెద్దసేవలో ఉత్సవమూర్తులను అంబారీ సేవపై ఆలయంలో ప్రదక్షిణ చేయించారు.
ధర్మపురిలో..
ధర్మపురిలో లక్ష్మీసమేత యోగ, ఉగ్రనారసింహ, వేంకటేశ్వరుని మూలవిరాట్టులకు మహాక్షీరాభిషేకాలు, తదితర పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను ఆలయ ఆవరణలో వైకుంఠద్వారం ఎదురుగా అందంగా అలంకరించిన పుష్ప వేదిక పైకి తీసుకవచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రాతఃకాలం 5గంటల సమయంలో వైకుంఠ ద్వారం వద్ద పూజలు చేసి ద్వారం తెరిచారు. అనంతరం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, కలెక్టర్ రవి, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్లు ఉత్తర ద్వార పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం వైకుంఠద్వారం ద్వారా లోనికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఊరేగింపు సేవలను రద్దు చేశారు.
కొండగట్టులో..
జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఆంతరంగికంగానే ఆలయ అధికారులు, అనువంశీక అర్చకులు ముక్కోటి ఏకాదశి వేడుకలను నిర్వహించారు. ఉత్తరద్వారం వద్ద ఈవో టంకశాల వెంకటేశ్ సమక్షంలో ఆలయ అర్చకులు ప్రాతఃకాలమున పూజలు చేసి ఉత్తర ద్వారం తెరిచారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో గోదారంగనాథులకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఆంజనేయస్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు.
కరీంనగర్లో..
మార్కెట్ రోడ్డులోని వేకంటేశ్వరస్వామి ఆలయం, మంకమ్మతోటలోని వేంకటేశ్వర ఆలయం, భగత్నగర్ జడ్పీ వేంకటేశ్వర ఆలయం, సప్తగిరికాలనీ కోదండ రామాలయంతోపాటు అన్ని ఆలయాల్లో వేడుకలు నిర్వహించారు.
యాదాద్రి తరహాలో అభివృద్ధి: మంత్రి ఈశ్వర్
ధర్మపురి, జనవరి 13: ధర్మపురి క్షేత్రాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివార్లను దర్శించుకున్న అనంతరం మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి బడ్జెట్లో రూ.100కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుతం రూ.46కోట్లతో పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ధర్మపురి క్షేత్రాన్ని రానున్న రోజుల్లో టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆగమ శాస్త్ర పద్ధతులను అనుసరించి, స్థపతుల సూచనల మేరకు ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు చేపడతామన్నారు. భక్తుల సౌకర్యార్థం బస్టాండ్ వద్ద 60 గదులు అదనంగా నిర్మిస్తామన్నారు. అలాగే స్వామివార్లకు కొత్త రథాల తయారీతోపాటు రథశాలను నిర్మించనున్నారు. గోదావరి తీరాన మంగళి గడ్డ వద్ద, పుష్కరఘాట్ల వద్ద డార్మెటరీలను నిర్మిస్తామని, సుందరీకరణ పనులు చేపడతామన్నారు. ఈ పనులన్నీ యాదాద్రి టెంపుల్ డిజైనర్, స్థపతి సూచనల మేరకు చేపడతామని వివరించారు.