సారపాక, జనవరి 19: ఊరంతా శుభ్రంగా ఉంటే, అక్కడి ప్రజలందరి ఆరోగ్యం భద్రంగా ఉంటుందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సారపాక పంచాయతీలో చెత్త సేకరణకు కేటాయించిన జటాయువు వాహనాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు వెచ్చిస్తున్నదని అన్నారు. ప్రతి వీధి స్వచ్ఛంగా ఉండాలన్నారు. ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు నిత్యం ముమ్మరంగా చేపట్టాలని, ఫాగింగ్ చేయించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ భగవాన్రెడ్డి, ఎంపీడీవో వివేక్రామ్, ఎంపీవో సునీల్ శర్మ, పంచాయతీ ఈవో కంది మహేష్, జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, ఏఎంసీ చైర్పర్సన్ పొడియం ముత్యాలమ్మ, సొసైటీ అధ్యక్షుడు బిక్కసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
విస్తృత పర్యటన
సారపాకతోపాటు తాళ్లగొమ్మూరు, కోయగూడెం పంచాయతీల్లో ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం విస్తృతంగా పర్యటించారు. కోయగూడెం, తాళ్లగొమ్మూరులో బస్ షెల్టర్ నిర్మాణానికి స్థలాలను పరిశీలించారు. సారపాకలోని సారపాక-భద్రాచలం బ్రిడ్జి సమీపంలో పబ్లిక్ పార్క్కు స్థలాన్ని, బసప్ప క్యాంప్, సంత ఏరియా, ఈస్ట్ గేట్, రాంబో టైలర్ వీధి, గాంధీనగర్ ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి స్థలాలను పరిశీలించారు.
అల్పాహారం అందజేత
మణుగూరు రూరల్: రేగా విష్ణు మెమోరియల్ చారిటుబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని పుష్పగిరి కంటి ఆస్పత్రిలో ఉచితంగా కంటి శస్త్ర చికిత్స చేయించుకుని బుధవారం తిరిగొచ్చిన వారికి ఎమ్మెల్యే రేగా కాంతారావు తన క్యాంప్ కార్యాలయంలో స్వాగతం పలికారు. అల్పాహారం ఇచ్చారు.
వినతిపత్రం స్వీకరణ
మణుగూరు రూరల్: బీటీపీఎస్లోని నిర్మాణ కార్మికులను అక్కడే కాంట్రాక్ట్ కార్మికలుగా నియమించాలని కోరుతూ కార్మిక సంఘం హెచ్-43 నాయకులు ఎమ్మెల్యే రేగా కాంతారావుకు బుధవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, రంజిత్, నాయకులు వెలదండి ప్రసాద్, వరప్రసాద్, భరత్తేజ, ఫయీమ్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ క్రీడాకారుడికి బహుమతి ప్రదానం
బూర్గంపహాడ్: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో సతీష్రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. బుధవారం ఉదయం మ్యాచ్లో వేపలగడ్డ ఎలెవన్ జట్టుపై ముసలిమడుగు ఆర్కె ఎలెవన్ జట్టు, మధ్యాహ్నం మ్యాచ్లో బంజర్ ఓల్డ్ స్ట్రీట్ బాయ్స్ జట్టుపై నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పీబీసీ ఎలెవన్ జట్టు, సాయంత్రం మ్యాచ్లో బూర్గంపహాడ్ బబ్బు ఎలెవన్ జట్టుపై బంజర్ శివ ఎలెవన్ జట్టు గెలుపొందాయి. ఉత్తమ క్రీడాకారుడికి బహుమతిని ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రదానం చేశారు.
నివాళి, పరామర్శ
మణుగూరు రూరల్: మణుగూరు పట్టణ నివాసి గొల్లమందల వెంకటేశ్వర్లు(45) బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని ఎమ్మెల్యే రేగా కాంతారావు సందర్శించి నివాళి అర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దహన సంస్కారాలకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి రూ.5,000 అందించారు. ఆయన వెంట టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అడపా అప్పారావు, సీనియర్ నాయకుడు తాళ్లపల్లి యాదగిరి గౌడ్ ఉన్నారు.
బూర్గంపహాడ్: మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామస్తుడు వెలిశెట్టి సీతారామ య్య(85) ఇటీవల మృతిచెందారు. ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం పరామర్శించారు. చిత్రపటం వద్ద నివాళి అర్పించారు.