అబిడ్స్ : భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సామాజిక, ఆధ్యాత్మిక సేవలతో పాటు అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారిని ప్రయోజకులను చేస్తోందని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో సేవా సమితి ఆధ్వర్యంలో 15వ అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, తెలంగాణ టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్, జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్, మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా, టీఆర్ఎస్ నాయకులు ఎం ఆనంద్కుమార్ గౌడ్, ఆల పురుషోత్తం రావు, నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్లు హాజరై అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ సమితి సేవలను గుర్తించిన కేరళలోని ట్రావన్కోర్ దేవస్థానం ఈ సారి శబరిమలైలో లక్షలాది మంది భక్తులకు అన్నదానం, హెల్ప్ డెస్క్, ఆలయ పుష్పాలంకరణ వంటి సేవా కార్యక్రమాలకు అవకాశం కల్పించడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి స్వచ్చంద సేవా సంస్థలను ఇతర సంస్థలు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు.
బాస్ అద్యక్షుడు క్యాతం రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మెడిశెట్టి రాకేష్, కోశాధికారి సిఎ అనిల్కుమార్ల ఆధ్వర్యంలో 44 మంది చిన్నారులను అక్కున చేర్చుకుని వారికి విద్య, వసతి, భోజనం కల్పించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా మైదానంలో దాదాపు 500 మంది బాస్ సభ్యులు రక్తదానం చేశారు.