తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులు, కళాకారులు, రచయితలు అత్యంతక్రియాశీలకంగా పాల్గొన్నారని కవి, విమర్శకులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో జరుగుతున్న పరిణతవాణి ప్రసంగలహారిలో భాగంగా శుక్రవారం నిర్వహించిన సభలో సుంకిరెడ్డి నారాయణరెడి పాల్గొని జీవితం, సాహిత్యం తదితర అంశాలపై ప్రసంగించారు.
నల్లవలస సంకలనంలో రాసిన కవితను ఆయన ఈ సందర్బంగా ఉదహరించారు. మిలియన్ మార్చ్ సందర్బంలో ఉద్యమకారులను తన కవితలు ప్రభావితం చేయడంతో పాటు ఎంతో ప్రాచుర్యం పొందాయని వివరించారు. బాల్యం నుంచే సాహిత్యంపై అభిలాష, గ్రంథపఠనం పట్ల ఆసక్తి పెంచుకుని ఎదిగానని అన్నారు.
1977లో జయంతి పత్రికలో ధ్వని అనే తన మొదటి కవిత ప్రచురితమైందన్నారు. నాలుగు దశాబ్థాలుగా కవిగా, విమర్శకునిగా, సాహిత్య చరిత్ర నిర్మాతగా, వ్యాసకర్తగా, సంస్థా నిర్వాహకునిగా, ప్రత్యేక సంచికల సంపాదకునిగా తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నానని వివరించారు.
సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర చదివి స్పూర్తి పొందానని తెలిపారు. తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ సుంకిరెడ్డి నారాయణరెడ్డి సాహిత్య ప్రక్రియలలో తెలంగాణ ఆత్మను ఆవిష్కరించారని ప్రశంసించారు.
పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, కార్యవర్గ సభ్యులు డాక్టర్ సి. వసుంధరారెడ్డి, సురవరం కృష్ణవర్థన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శనివారం ఇదే వేదికపై ప్రముఖ సాహతీవేత్త గన్నమరాజు గిరిజా మనోహరబాబు ప్రసంగం చేస్తారని నిర్వహకులు తెలిపారు.