మాయదారి మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రెండోవేవ్ తరువాత ప్రజలు ఒకింత ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మూడోవేవ్ రూపంలో కొవిడ్ ముప్పుతిప్పలు పెడుతున్నది. ఉమ్మడి జిల్లాలో కొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రాణనష్టం తక్కువగా ఉంటున్నప్పటికీ వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో డిసెంబర్ నెలాఖరు వరకు సింగిల్ డిజిట్లో కేసులు వెలుగుచూడగా.. మూడు వారాల వ్యవధిలోనే రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య వందల్లోకి చేరింది. ఈ నెల 13న నిజామాబాద్ జిల్లాలో 117 పాజిటివ్ కేసులు నమోదుకాగా, వారం ముగిసేసరికి ఈ సంఖ్య నాలుగురెట్లు పెరిగింది. గురువారం ఒక్కరోజే 455 మంది కొవిడ్బారిన పడడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నది. వైరస్ ఉధృతి నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం అన్ని ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స కోసం ఏర్పాట్లు పూర్తిచేసింది.
నిజామాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెండేండ్లుగా అందరినీ ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా వైరస్.. ఇప్పుడు మూడో వేవ్ రూపంలో విరుచుకు పడుతోంది. సెకండ్ వేవ్ మాదిరిగానే ప్రమాదకరమైన స్థాయిలో వైరస్ వ్యాప్తి జరుగుతోంది. ప్రాణ నష్టం తక్కువగా ఉంటున్నప్పటికీ వైరస్ సోకుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్లో చాలా మందిలో లక్షణాల్లేకుండానే సోకడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ కార్యాలయంలో 30 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా 8 మందికి పాజిటివ్గా తేలింది. వైరస్ సోకిన వారందరిలో లక్షణాలే లేకపోవడం… వారంతా అప్పటి వరకు కార్యాలయంలో అందరితోనూ కలివిడిగా తిరగడంతో మిగిలిన వారంతా టెన్షన్కు గురయ్యారు. మాస్కులు పెట్టుకుని జాగ్రత్తలు తీసుకున్న వారంతా క్షేమంగానే బయట పడగా మూడు రోజుల తర్వాత అదే కార్యాలయంలో నిర్వహించిన టెస్టుల్లో మరో నలుగురికి వైరస్ అంటుకోవడం విశేషం. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తేనే వైరస్కు దూరంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. డిసెంబర్ నెలాఖరు వరకు సింగిల్ డిజిట్లో కేసులు వెలుగు చూడగా… సరిగ్గా మూడు వారాల వ్యవధిలో పాజిటివ్ కేసులు వందల్లో రావడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
కేసుల పెరుగుదల ఇలా…
నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. గడిచిన వారం రోజులుగా ఉగ్రరూపం దాల్చింది. డిసెంబర్ నెలలో డబుల్ డిజిట్ కూడా దాటని పాజిటివ్ కేసులు ఇప్పుడు ఏకంగా మూడు అంకెల్లో నమోదు అవుతుండడం భయాందోళనకు గురి చేస్తోంది. డిసెంబర్ నెల ఆరంభంలో కరోనా కేసులు ఎక్కడా కనిపించ లేదు. మొదటి వారంలో జిల్లాలోని ఏ ప్రభుత్వ దవాఖానలోనూ కరోనా నిర్ధారణే కాలేదంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా వేలాది మంది పరీక్షల కోసం దవాఖానలకు క్యూ కడుతుండగా వందలాది మందికి మహమ్మారి సోకినట్లుగా తేలుతోంది. డిసెంబర్ 8వ తేదీన జిల్లా వ్యాప్తంగా 339 మందికి పరీక్షలు నిర్వహిస్తే అందరికీ నెగెటివ్ వచ్చింది. డిసెంబర్ 21వ తేదీన 274 మందికి పరీక్షలు నిర్వహిస్తే కేవలం ఒక్కరికి మాత్రమే పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. డిసెంబర్ 31న 304 మందికి పరీక్షలు చేస్తే ముగ్గురికి మాత్రమే కరోనా సోకినట్లుగా తేలింది. నూతన సంవత్సరం ప్రారంభంతో కరోనా కేసుల విజృంభన ఒక్కసారిగా పెరగడం మొదలైంది. జనవరి 13న 834 మందికి పరీక్షలు చేస్తే ఏకంగా 117 కేసులు బయట పడ్డాయి. 14న 637 మందిలో 154 మందికి వైరస్ సోకింది. గడిచిన నాలుగైదు రోజులు నుంచి వందల్లో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
నేటి నుంచి ఇంటింటి సర్వే…
కొవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్లో రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానాలు యావత్ దేశాన్ని ఆకట్టుకున్నాయి. ఇందులో రెండో ఉధృతిలో చేపట్టిన ఇంటింటి సర్వేతో కరోనా వ్యాప్తి చాలా వరకు తగ్గిపోయింది. జ్వర సర్వే పేరిట నిర్వహించిన కార్యక్రమం మూలంగా కరోనా లక్షణాలున్న వారిని ఇంటికే పరిమితం చేయగలిగింది. తీవ్రత ఎక్కువ ఉన్న వారు, వయస్సు రీత్యా, ఇతర ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఇబ్బందులు తప్పవని గ్రహించిన వారు మాత్రం దవాఖానలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. సాధారణంగా కరోనా సోకిన వ్యక్తి తనకు పాజిటివ్ సోకిందని తేలే వరకు జనాల్లోనే తిరుగుతున్నాడు. లక్షణాలు బయటపడిన తర్వాత ఒకట్రెండు రోజులకు పరీక్షలు చేయించుకోవడంతో సదరు వ్యక్తి నుంచి వ్యాప్తి పెరుగుతోంది. ఈ తంతుకు ముగిం పు పలికేందుకు ప్రభుత్వం మరోమారు ఇంటింటి సర్వేకు రంగం సిద్ధం చేసింది. నిజామాబాద్ జిల్లాలోనూ సర్వేకు వైద్యారోగ్య శాఖ బృందాలు రెడీగా ఉన్నాయి. ఔషధాలతో కూడిన కిట్లు కూడా లక్షణాలున్న వారికి అందించి ఇంటి వద్దే చికిత్సకు అవసరమయ్యే సహకారం, సలహాలు అందించనున్నాయి.
నిర్లక్ష్యం వీడితేనే…
పొరుగున మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులతోపాటు కరోనా ఇతర వేరియంట్లు రాకెట్ వేగంతో జనాలకు అంటుకుంటోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో మరాఠా ప్రజలంతా ఆగమాగమవుతున్నారు. కఠిన ఆంక్షల మధ్య అక్కడి జనం జీవనం సాగిస్తున్నారు. మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కరోనా కలకలం మొదలైంది. వైరస్ ముప్పు బారిన పడకుండా ఉండాలంటే రక్షణ చర్యలు పాటిస్తే మంచిదని వైద్యులు, వైద్య నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. అయినప్పటికీ జనాల్లో మాత్రం కాసింత భయం అన్నది కనిపించడం లేదు. మాస్కుల్లేకుండానే చాలా మంది రోడ్లపై తిరుగుతున్నారు. కరోనా మూడో వేవ్లో వ్యాప్తి రేటు గణనీయంగా పెరిగింది. ఒక ఇంట్లో లేదంటే ఒక సమూహంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో మిగతా వారికి త్వరగా సోకుతుంది. ఇటువంటి సందర్భంలో ఏ మాత్రం ఏమరుపాటు అన్నది పనికి రాదు. నూతన సంవత్సర వేడుకల్లో ఇష్టారాజ్యంగా పాల్గొన్న వారిలో చాలా మంది కరోనా ముప్పును ఎదుర్కొంటున్నారు. డిసెంబర్ నెలాఖరు నుంచి ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్నప్పటికీ చాలా మంది పట్టించుకోలేదు. ఇప్పుడు వైరస్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు.
లక్షణాల్లేకుండానే పాజిటివ్
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో మూడో వేవ్కు తగ్గట్లుగా వైద్య సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రతి బెడ్కు ఆక్సిజన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. గతంలో కన్నా ఇప్పుడు మరిన్ని పెంచి 717 పడకలను అమర్చాం. ప్రస్తుతం కరోనా పరీక్షల్లో పాజిటివ్ సోకుతున్న వారిలో చాలా మందికి లక్షణాలే ఉండడం లేదు. వైరస్ వచ్చినప్పటికీ చాలా మందికి తెలియడం లేదు. అలా కలియదిరగడం మూలంగా వైరస్ వ్యాప్తి చెందుతున్నది.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
మూడో వేవ్ మొదలైన నేపథ్యంలో ప్రజలంతా ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్ రూల్స్ తప్పక పాటించాలి. కరోనా మన చుట్టే ఉందనుకుని మసలుకోవాలి. మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం చాలా ముఖ్యమైనవి. టీకాలు తీసుకున్న వారు కూడా జాగ్రత్తలు పాటించాల్సిందే. జన సమూహాలకు కొద్ది రోజులు దూరంగా ఉంటే ముప్పు నుంచి బయటపడొచ్చు.