మన్సూరాబాద్ : అవయవాల మార్పిడి కోసం రాచకొండ పోలీసులు గ్రీన్ చానెల్ను ఏర్పాటు చేసి ఇద్దరు వ్యక్తులకు ప్రాణం పోశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు (గుండె, ఊపిరితిత్తులు) ఎల్బీనగర్లోని కామినేని దవాఖాన నుంచి బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్కు చేర్చేందుకు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఉదయం గ్రీన్ ఛానెల్ను ఏర్పాటు చేశారు.
అవయవాలను కామినేని నుంచి ఉదయం 8.04 తీసుకుని బయలుదేరి కిమ్స్ ఆస్పత్రికి ఉదయం 8.19 గంటలకు అంబులెన్స్ చేరుకుంది. పదిహేను నిమిషాల్లో 17.6 కిలోమీటర్ల ప్రయాణం సాఫీగా సాగేలా ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న చర్యలపై సీపీ మహేష్భగవత్ అభినందించారు.
విజయవాడకు చెందిన పద్మలక్ష్మీ కుమారుడు ఎం. వెంకట ప్రభాకర కశ్యప్ (24) పోస్టాఫీసులో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు. జనవరి 1న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని విజయవాడనుంచి ఆదివారం రాత్రి హైదరా బాద్ లోని ఎల్బీనగర్ కామినేని దవాఖానకు తీసుకువచ్చారు. యువకుడిని పరిశీలించిన వైద్యులు బ్రెయిన్డెడ్ అయిన ట్లు తెలిపారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న జీవన్ధాన్ సంస్థ ప్రతినిధులు వెంకట ప్రభాకర కశ్యప్ కుటుంబసభ్యులను కలుసుకుని అవయదానంపై అవగాహన కల్పించారు. కుటుంబసభ్యుల అంగీకారంతో మంగళవారం ఉదయం 8 గంటలకు వెంకట ప్రభాకర కశ్యప్ అవయవాలు గుండె, ఊపిరితిత్తులు గ్రీన్ ఛానెల్ ద్వార బేగంపేటలోని కిమ్స్ దవాఖానకు తరలించారు. కాలేయాన్ని కామినేని దవాఖానలో మరో వ్యక్తికి అమర్చారు.