సైదాబాద్ : దేశంలో ఎక్కడలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యాదవ కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేసి వారి ఆర్ధికాభివృద్ధికి ఎంతోగాను కృషి చేస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు.
ఆదివారం సైదాబాద్ హనుమాన్ మందిరం ఆవరణలో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ అఖిల భారత యాదవ మహాసభ రూపొందించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వేల కోట్ల రూపాయల వ్యయంతో యాదవుల అభివృద్ధికి గొర్రెల పంపిణీ పథకం (ఎన్సీపీ)కింద మొదటి విడతలో 3 లక్షల 50 వేల కుటుంబాలకు, రెండవ విడతలో మూడు లక్షాల అరవై వేల కుటుం బాలకు గొర్రెలను పంపిణీ చేసిందని, యాదవుల అభివృద్ధికి అన్ని విధాలుగా ప్రోత్సహించటం జరుగుతుందన్నారు.
నగరంలో యాదవుల ఆత్మగౌరవ భవనం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని, 5కోట్ల రూపాయలను కేటాయించటంతో భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రేటర్ పరిధిలో ఉన్న యాదవుల ఆర్ధిక అభివృద్ధికై ప్రోత్సాహక అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు.
అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైల్కోల్ మహేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబురావు యాదవ్ , గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి గడ్డం కృష్ణయాదవ్, కన్నె రాజ్కుమార్ యాదవ్, శ్రీశైలం యాదవ్, వంగ మల్లేష్ యాదవ్, బాల మల్లేష్ యాదవ్, యశ్వంత్ రాజ్ యాదవ్, విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.