సత్తుపల్లి రూరల్, జనవరి 14: అన్నదాతల శ్రేయస్సే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తెలంగాణలోని రైతులను రాజులుగా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకుని వారి సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. వారి పంటల పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకాన్ని తెచ్చి రాష్ట్రంలోని రైతులకు రూ.50 వేల కోట్ల పెట్టుబడి సహాయం అందించిన నేపథ్యంలో రాష్ట్రమంతా రైతుబంధు సంబురాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం మండలంలోని కొత్తూరులో జరిగిన రైతుబంధు ముగింపు వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అదనపు కలెక్టర్ మధుసూదన్రావుకు మహిళలు, రైతులు, టీఆర్ఎస్ నాయకులు గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతును రాజు చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. అన్నదాతల కోసం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు లేవని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం
రైతుబంధు పథకం ద్వారా రూ.50 వేల కోట్ల పంటల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, స్థానిక రైతులు, మహిళలు పుష్పాభిషేకం చేశారు.