ప్రధానాలయం పునః ప్రారంభానికి సిద్ధమవుతున్నది. మార్చి 28న జరిగే మహాకుంభ సంప్రోక్షణ వరకు పనులు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే స్వయంభువుల ప్రధానాలయంతోపాటు శివాలయం, లడ్డూ ప్రసాద విక్రయశాల, కొండ కింద దీక్షాపరుల మండపం పూర్తికాగా.. కొండపైన విష్ణు పుష్కరిణి, క్యూ కాంప్లెక్స్, బస్టాండ్, స్వాగత తోరణం, కొండపైకి, కొండకిందికి వచ్చే ఫ్లై ఓవర్, కొండ కింద గండి చెరువు సుందరీకరణ, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, బస్ టెర్మినల్, సత్యనారాయణ వ్రత మండపం నిర్మాణాలు తుది దశకు చేరాయి. కొండకింద ఈశాన్య ప్రాంతంలో మహా సుదర్శన యాగానికి కావాల్సిన స్థలం, వీఐపీల పార్కింగ్ చదును పనులు సాగుతున్నాయి. ఫిబ్రవరిలోపు పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. సప్తతల రాజగోపురాలపై కలశ స్థాపనకు చేపట్టిన స్కాఫ్ హోల్డింగ్(పరంజా) పనులు సాగుతుండగా, పడమటి సప్తతల రాజగోపురానికి బిగింపు పనులు పూర్తయ్యాయి. త్వరలో తూర్పు, ఉత్తరం, దక్షిణ పంచతల రాజగోపురాలకు స్కాఫ్ హోల్డింగ్ చేపట్టనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకునేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి శుక్రవారం యాదాద్రికి రానున్నారు. పనులను పరిశీలించి వైటీడీఏ, ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయం పునః ప్రారంభానికి
సిద్ధమవుతున్నది. మార్చి 28న జరిగే మహాకుంభ సంప్రోక్షణ నాటికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తుది దశ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు.
తుది దశకు స్వర్ణ తొడుగులు..
గర్భ గుడి ముఖ ద్వారం తలుపులకు 14 బంగారు నరసింహ విగ్రహాలు, 36 కమలం పుష్పాలతో పాటు 36 గంటలను అమర్చారు. ద్వార బంధాన్ని చిలుక ఆకృతిలో రూపొందించారు. గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తొడుగుల పనులు తుదిదశకు చేరుకున్నాయి. 1,785 గ్రాముల మేలిమి బంగారంతో చైన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్ సంస్థ ప్రత్యేక స్వర్ణ తాపడాలను చేయగా రాగి పనులు మహాబలిపురానికి చెందిన శిల్పి రవీంద్రన్ రూపొందించారు. బలిపీఠానికి 1,552 గ్రాముల బంగారు వర్ణపు తొడుగులు అమర్చుతున్నారు.
కొండపైన సాగుతున్న పనులివే..
కొండపైన రెండు ఘాట్ రోడ్లు కలిసే ప్రదేశంలో 40 ఫీట్ల ఎత్తు, 20 ఫీట్ల వెడల్పుతో స్వాగత ఆర్చిని నిర్మిస్తున్నారు.ఎస్పీఎఫ్ భవనం, బస్ బే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ పక్కనే క్యూ కాంప్లెక్స్ పనులు పూర్తి కావచ్చాయి. కొండపైకి వెళ్లేందుకు ఒక ఫ్లై ఓవర్, కిందికి దిగేలా మరో ఫ్లె ఓవర్ను నిర్మిస్తున్నారు. కొండకింద వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారి మెట్ల పనులు పూర్తికావొచ్చాయి. లడ్డూ ప్రసాద తయారీ యంత్రాల ట్రయల్ రన్ పూర్తి చేశారు.
ఐదెకరాల్లో ఆర్టీసీ బస్ టర్మినల్..
లక్ష్మీపుష్కరిణి పక్కన, నిత్యన్నదాన భవనం ముందుభాగంలో ఐదెకరాల్లో బస్ టర్మినల్ నిర్మిస్తున్నారు. రూ.6.90 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే బస్టాండ్ పనులను వైటీడీఏ అధికారులు ఆర్టీసీకి అప్పగించారు. 44పిల్లర్లు, 8,800 ఎస్ఎఫ్టీ ఏరియాలో నిర్మించే బస్టాండులో 10 ఫ్లాట్ఫామ్స్ ఉండనున్నాయి. ఇక్కడ కూడా దుకాణాలు, టాయిలెట్స్ నిర్మిస్తున్నారు.
నేడు దేవాదాయశాఖ
మంత్రి సమీక్ష.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ
పనులపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు పనులను పరిశీలించి వైటీడీఏ, ఆలయ అధికారులతో సమావేశం కానున్నారు. పనులపై తుది నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్కు అందించనున్నారు.
గండిచెరువు సుందరీకరణ..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు గండిచెరువు పరిసరాలను పూర్తిగా పచ్చదనంతో నింపనున్నారు. ఇందుకోసం రూ. 33.69 కోట్లు కేటాయించారు. రూ.20.10 కోట్లతో గండిచెరువు పూడికతీత, రక్షణగోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భక్తులు కుటుంబ సమేతంగా గడిపేందుకు సహజ సిద్ధమైన చెట్ల పందిళ్లు, బల్లలు, పాత్వే, సైకిల్ ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నారు. చెరువుచుట్టూ నడకదారి నిర్మాణాలు చేపట్టారు. గండిచెరువును చేరుకునేందుకు లింక్రోడ్లను సైతం నిర్మించనున్నారు. మిగతా రూ.13.59 కోట్లతో గండిచెరువు పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు, పూల మొక్కలు, దేవతావృక్షాలు, ఔషధ మొక్కలను నాటనున్నారు. లేజర్షోలను తలపించే విధంగా ఫౌంటెయిన్లు నిర్మించనున్నారు. పరిసర ప్రాంతాల్లో ఆర్నమెంటల్ లైటింగ్ సిస్టమ్, గండిచెరువులో బోటు షికారు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కాళేశ్వరం 16వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న నృసింహస్వామి జలాశయం నుంచి గోదావరి జలాలను గండిచెరువుకు తరలించేలా ప్రణాళికలు రూపొందించారు.
చివరి దశకు కల్యాణకట్ట…
భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు లక్ష్మీపుష్కరిణి కిందిభాగంలో 2.33 ఎకరాల స్థలంలో రూ.20.25 కోట్ల వ్యయంతో కల్యాణకట్ట సిద్ధమైంది. మహిళలు, పురుషులకు ప్రత్యేక హాళ్లను నిర్మించారు. ఒకేసారి 360 మంది పురుషులు, 160 మంది మహిళలు తలనీలాలు సమర్పించుకోవచ్చు. పురుషులకు 20 స్నానాల గదులు, వేడి నీటి సదుపాయం, దుస్తులు మార్చుకునేందుకు మరో 26 గదులను నిర్మిస్తున్నారు. స్త్రీలకు 22 స్నానాల గదులు, 86 టాయిలెట్స్, వేడి నీటి సదుపాయం, దుస్తులు మార్చుకునేందుకు 20 గదులను నిర్మిస్తున్నారు.
దీక్షాపరుల మండపం రెడీ..
స్వామివారి మాలధారణ దీక్ష తీసుకునే భక్తుల సౌకర్యార్థం గండిచెరువు సమీపంలో ప్రత్యేక భవన నిర్మాణం పూర్తయ్యింది. 18వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా రెండు హాళ్లను నిర్మించారు. వీటితో పాటు మెడిటేషన్ హాల్ను కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
అన్నదాన సత్ర భవన నిర్మాణం కొండకింద గండిచెరువు కింది
భాగంలో రెండు ఎకరాల స్థలంలో రూ.15 కోట్ల వ్యయంతో నిత్యాన్నదాన సత్ర భవన పనులు జరుగుతున్నాయి. 2.55 ఎకరాల్లో జీ ఫ్లస్ వన్ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఒక్కో హాల్లో ఏకకాలంలో 360 మంది, రెండు హాళ్లలో కలిపి మొత్తం 720 మంది భక్తులు భోజనం చేసే వీలుంటుంది.