ఖైరతాబాద్ : దేశానికి అన్నం పెట్టే అన్నదాత తాను మరణిస్తూ ఐదుగురికి ఆయువు పోశాడు. నల్గొండ జిల్లా జాజిరెడ్డి గూడెంకు చెందిన రైతు కొరాపిదత్త సత్తయ్య (55) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 20న సత్తయ్య ఒక్కసారిగా ఆపస్మారక స్థితిలోకి వెళ్లి కిందపడిపోయాడు.
కుటుంబ సభ్యులు మలక్పేటలోని యశోద దవాఖానకు తరలించగా, చికిత్స అందించారు. సుమారు 72 గంటల పాటు చికిత్స అందించినా ఫలితం లేదు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఐసీ బ్లీడ్గా గుర్తించారు. ఈ నెల 23న బ్రెయిన్డెడ్కు గురైనట్లు న్యూరో ఫిజీషియన్లు నిర్ధారించారు.
విషయం తెలుసుకున్న జీవన్దాన్ ప్రతినిధులు ఆస్పత్రిలోని కుటుంబసభ్యులను కలిసి అవయవదానం చేయడం ద్వారా పలువురిలో సత్తయ్య జీవించే ఉంటాడని వారికి దాని విశిష్టతను వివరించారు. అందుకు వారు అంగీకరించారు. సత్తయ్య శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, ఊపిరితిత్తులను సేకరించారు.
అవసరమైన రోగులకు ఆ అవయవాలను అందిస్తామని వైద్యులు తెలిపారు. అవయవదానం కోసం ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను జీవన్దాన్ ప్రతినిధులు అభినందించారు.