అమీర్పేట్ : రాష్ట్రంలోని పెద్దపెద్ద పుణ్య క్షేత్రాలను తలపించే స్థాయిలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ పరిసరాలను తీర్చిదిద్దుతానని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. ఎల్లమ్మ భక్తుల వాహనాల పార్కింగ్ సమస్యకు పరిష్కారంగా రూ. 4.80 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్తులతో కూడిన పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శుక్రవారం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు.
దేవాలయ పరిసరాలను భక్తులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు శాశ్వత క్యూ లైన్ల నిర్మాణాలతో పాటు ప్రస్తుత షెడ్డు తరహాలోనే పార్కింగ్ కాంప్లెక్స్ మార్గంలో కూడా దాతల చేయూతతో చక్కటి షెడ్డు నిర్మాణాలు జరిగేలా చూస్తానని మంత్రి ఈ సందర్భంగా తనను కలిసిన భక్తులకు వివరించారు.
ప్రస్తుత పార్కింగ్ కాంప్లెక్స్ ఆవరణలోనే కొబ్బరికాయల దుకాణాలను తరలించేలా చూస్తానని తెలిపారు. ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం నిర్మితమవుతున్న పార్కింగ్ కాంప్లెక్స్లో కార్లు 40, ద్విచక్రవాహనాలు 200లను ఏకకాలంలో పార్కింగ్ చేసుకునేంత సౌకర్యవంతంగా కాంప్లెక్స్ నిర్మాణం జరిగేలా చూస్తానని, 8 నెలల్లో ఈ కాంప్లెక్స్ నిర్మాణాలు పూర్తి చేసుకుని భక్తులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్న పరిస్థితుల్లో దేవాలయ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయా రోజుల్లో ట్రాఫిక్ మళ్లింపులు జరిగేలా చూస్తానని, ఆ విధంగా దేవాలయ పరిసరాలను భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు.
ఈ కార్యక్రమంలో అమీర్పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, దేవాలయ చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, ఈవో ఎస్.అన్నపూర్ణ, దేవాలయ పాలక మండలి సభ్యులు హనుమంతరావు, అశోక్యాదవ్, సింగారపు శ్రీనివాస్ గుప్తా, బీ.ఆర్.నారాయణరాజు, ఉమనాథ్గౌడ్, ఆంజనేయులుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.