ఖైరతాబాద్ : నేతన్నలపై కేంద్రం జీఎస్టీ గుదిబండ వేయడాన్నివ్యతిరేకిస్తూ నేతన్నలు హండ్లూమ్ మార్చితో తమ నిరసన తెలిపారు. బుధవారం పీవీ నరసింహా రావు మార్గ్లోని పీపుల్స్ప్లాజా వద్ద అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హాండ్లూమ్ మార్చ్ నిర్వహించారు.
ఈ మార్చ్ను ఎమ్మెల్సీ ఎల్. రమణ, సినీ నటి పూనమ్ కౌర్, సంఘం హండ్లూమ్ విబాగ్ చైర్మన్ ఎరమద వెంకన్న నేత, ప్రధాన కార్యదర్శులు గడ్డం జగన్నాధం, ఉపాధ్యక్షులు కందగట్ల స్వామి, తెలంగాణ పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ అధ్యక్షులు గుండేటి శ్రీధర్, రాష్ట్ర అధ్యక్షులు అవ్వారి భాస్కర్తో కలిసి ప్రారంభించారు.
రమణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నేతన్నలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. చేనేతకు చేయూత, నేతన్న నేస్తం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి ఆత్మహత్యలను నివారించి ఆదుకుంటున్న తరుణంలో కేంద్రం నిర్ణయంతో వారికి కొత్త సమస్య వచ్చిపడిందన్నారు.
నేతన్నల బలవన్మరణాలు ఆగిన క్రమంలో కేంద్రం చర్యల వల్ల మళ్లీ వారిని ఆత్మహత్యలవైపు పురిగిగొలిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఏ పాలకులు కూడా పన్నులు వేయడానికి సాహసించలేదని, వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం చేనేత పరిశ్రమ అని, దీనిపై కోట్లాది మంది ఆధారపడి జీవిస్తున్నారన్నారు.
మానవుని మానాభిమానాలు కాపాడేందుకు వస్త్రాలు రూపొందిస్తున్న ఈ రంగంపై కేంద్రం నిరంకుశ వైఖరి అవలంబిస్తుంద న్నారు. ఇప్పటికే ఐదు శాతం జీఎస్టీని పెంచిన కేంద్రం 12 శాతానికి పెంపుదల చేస్తూ ప్రకటనలు జారీ చేసిందని, త్వరలో పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కంటి తుడుపు చర్యగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిందని, దీనిని ఎన్నికల తంతుగా చూడాల్సి వస్తుందన్నారు.
నటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత అత్యంత నష్టపోయిన రంగం చేనేత అని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే మన సంస్కృతిని కాపాడడమని, అందులో భాగమైన చేనేతపై ఇలాంటి చర్యలు తగదన్నారు. కరోనా మహమ్మారి తర్వాత నేతన్నలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి తరుణంలో జీఎస్టీ భారం మోపడం సరికాదన్నారు.
ప్రధాన మంత్రి మోదీ, కేంద్రం మంత్రులు పీయూష్ గోయెల్, నిర్మలా సీతారామన్లు చేనేతను ప్రొత్సహించే వారిగా జీఎస్టీని ఎత్తివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేడం బాబురావు, జాతీయ అధ్యక్షురాలు గుంటక రూప, పోరండ్ల శారద, యువజన సంఘం మాజీ అధ్యక్షులు డాక్టర్ కరాన్నటి శ్రీనివాస్, గురం శ్రావణ్, చెరుకు స్వామి, గనేశ్ తదితరులు పాల్గొన్నారు.