బంజారాహిల్స్ : యాదవుల కులదైవమైన మల్లన్నస్వామికి ప్రీతిపాత్రమైన ‘ఈర గోల’ను రాజకీయాల్లోకి లాగుతూ చిల్లర మాటలు మాట్లాడిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ వెంటనే క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ నాయకుడు మానుక రాజుయాదవ్, ఒగ్గు పూజారి సాయి ఉప్పలయ్య డిమాండ్ చేశారు.
బీజేపీలో చేరిన సందర్బంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను ఈర గోలతో కొడతామంటూ వ్యాఖ్యానించడంపై యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. బుధవారం జూబ్లీహిల్స్లోని పెద్దమ్మగుడిలో పూజలు చేసిన టీఆర్ఎస్ నాయకుడు రాజుయాదవ్, ఒగ్గు పూజారి ఉప్పలయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు.
యాదవులు పవిత్రంగా పూజించే ఈరగోలను రాజకీయాల్లోకి లాగడం సరికాదని, వెంటనే తీన్మార్ మల్లన్న యాదవులకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ వ్యవహారంలో చింతపండు నవీన్పై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.