–చెరువులలోకి శుద్ధి చేసిన జలాలు….
-శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా 7 చెరువుల వద్ద ఎస్టీపీల నిర్మాణం…
-రూ.404 కోట్లతో పనులు……ముమ్మరంగా స్థల సేకరణ ప్రక్రియ…
-నిత్యం మిలియన్ లీటర్ల మురుగు నీటి శుద్ది….
మియాపూర్ : మురుగు నీటితో కంపు వాసన కొట్టే చెరువులిక శుద్ధ జలాలతో కొత్త అందాన్ని సంతరించుకోనున్నాయి. ఏండ్ల తరబడి మురుగునీటి నిల్వకు కేంద్రాలుగా పేరొందిన తటాకాలు శుభ్రమైన నీటితో తళతళలాడే పనులకు సర్కారు శ్రీకారం చుట్టింది. చెరువుల సంస్కరణే లక్ష్యంగా కలుషిత నీటి ప్రవాహాన్ని అడ్డుకునే కొత్త ప్రయత్నాలను మొదలు పెట్టింది. నగర వ్యాప్తంగా 13 ఎస్టీపీల నిర్మాణానికి పచ్చజెండా ఊపిన ప్రభుత్వం అందులో 7 ఎస్టీపీలను ఐటీకి వేదికైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే చేపట్టబోతున్నది.
ఈ మేరకు అనుమతుల ప్రక్రియ పూర్తి కావటంతో చక చకా నిర్మాణ పనులను ప్రారంభించేందుకు గాను నియోజవర్గ ప్రతినిధి విప్ ఆరెకపూడి గాంధీ నేతృత్వంలో జలమండలి ఎస్టీపీ విభాగం, రెవిన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా స్థల సేకరణ ప్రక్రియను ముమ్మరం చేశారు. మరో వారంలోగా స్థలాల సేకరణను పూర్తి చేసి ఆ తదుపరి వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రధానంగా చెరువుల పరిరక్షణ, మురుగునీరు చెరువులలోకి రాకుండా అడ్డుకుని స్వచ్ఛమైన నీటితో చెరువులను ఆహ్లాదానికి నెలవుగా తీర్చిదిద్దే లక్ష్యంగా నియోజకవర్గవ్యాప్తంగా వీటిని చేపడతామని ఇప్పటికే విప్ గాంధీ ప్రకటించారు. సుమారు రూ. 404 కోట్లతో 7 చెరువుల వద్ద ఎస్టీపీల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 2023 జూన్ కల్లా ఎస్టీపీలు అందుబాటులోకి రానుండగా…. నిత్యం కొన్ని మిలియన్ల మరుగునీరు శుద్ధి చేయబడి చెరువులలోకి శుభ్రమైన జలాలుగా ప్రవహించనున్నాయి.
ఎక్కడెక్కడ ఆ నిర్మాణాలు…..
రాష్ట్రంలోనే అతి పెద్దదైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమ సింహభాగం విస్తరించి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధిక ప్రాధాన్యతగా ఈ నియోజకవర్గానికి ఏకంగా 7 ఎస్టీపీలను మంజూరు చేసింది. ఇందుకోసం రూ. 400 కోట్లపైనే వ్యయం చేయబోతున్నది.
-మియాపూర్ డివిజన్ పటేల్ చెరువు వద్ద 7 ఎంఎల్డీ మురుగు నీటి శుద్ధి సామర్థ్యం కలిగిన ఎస్టీపీ నిర్మాణాన్ని రూ.26.17 కోట్లతో.
-గంగారం పెద్ద చెరవు వద్ద 20 ఎంఎల్డీ నిల్వ సామర్థ్యం కలిగిన ఎస్టీపీ నిర్మాణాన్ని రూ. 64.14 కోట్లతో.
-దుర్గం చెరువు 7 ఎంఎల్డీ శుద్ది సామర్థ్యం కలిగిన ఎస్టీపీ నిర్మాణం రూ. 25.67 కోట్లతో
-ఖాజాగూడ చెరువు వద్ద 21 ఎంఎల్డీ శుద్ధి సామర్థ్యం కలిగిన ఎస్టీపీ నిర్మాణం రూ. 61.25 కోట్లతో.
-అంబీర్ చెరువు వద్ద 37 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన ఎస్టీపీ నిర్మాణాన్ని రూ. 100.87 కోట్లతో
-ఎల్లమ్మ కుంట చెరువు వద్ద 13.50 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన ఎస్టీపీ నిర్మాణాన్ని రూ.43.46 కోట్లతో.
-పరికి చెరువు వద్ద 28 ఎంఎల్డీ శుద్ధి సామర్థ్యం కలిగిన ఎస్టీపి నిర్మాణం రూ. 83.05 కోట్లతో చేపట్టనున్నారు.
అందుబాటులో స్థలాలు…
నియోజకవర్గవ్యాప్తంగా 7 ఎస్టీపీలకు కలిపి మొత్తం సుమారు 20 ఎకరాల వరకూ స్థలాలు అవసరం ఉన్నట్లుగా ఎస్టీపీ విభాగం అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఎల్లమ్మ చెరువు వద్ద 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. పటేల్ చెరువు వద్ధ ఎకరానికి పైగా స్థలం ఇప్పటికే అందుబాటులో ఉన్నది. దుర్గం చెరువు వద్ద సొంత స్థలంలోనే నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఎక్కడా ఎఫ్టీఎల్ పరిధిలోకి రాకుండా మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు పూర్తి ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు.
స్థల సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా స్వయంగా విప్ గాంధీ ఆయా విభాగాల అధికారులతో సమన్వయంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా మరో వారం లోగా స్థలాల సేకరణ 100 శాతం పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నెలాఖరుకు అన్ని ప్రాంతాలలో ఎస్టీపీల నిర్మాణాలు ప్రారంభిస్తామని ఇప్పటికే విప్ గాంధీ ప్రకటించారు. ఇవి అందుబాటులోకి రావటం ద్వారా నిత్యం ఆయా చెరువుల వద్ద కొన్ని మిలియన్ లీటర్ల మురుగు నీరు ప్లాంట్లతో శుద్ధి చేయబడి…చెరువులలోకి వెళతాయి. తద్వారా శుభ్రమైన నీటితో చెరువుల రూపురేఖలే మారనున్నాయి.
శుద్ధ జలాలతో …ఆహ్లాదంతో : విప్ ఆరెకపూడి గాంధీ…
నియోజకవర్గవ్యాప్తంగా 7 చెరువుల వద్ద రూ. 404 కోట్లతో ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టబోతున్నాం. ఇందుకు సంబంధించిన స్థలాల సేకరణ ముమ్మరంగా కొనసాగుతున్నది. త్వరలో ఆ ప్రక్రియను పూర్తి చేసి నెలాఖరుకల్లా నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. ప్రధానంగా చెరువులలోకి మురుగు నీరు రాకుండా వాటిని ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసి చెరువులలోకి వదులుతాం.
అంతేకాకుండా ఎస్టీపీల ప్లాంట్ల వద్ద ఆహ్లాదాన్నందించే పచ్చదనాన్ని అభివృద్ధి పరుస్తాం. మురుగు నీరు , దుర్వాసన, దోమల సమస్యలకు ఎస్టీపీల ద్వారా శాశ్వత పరిష్కారం చూపబోతున్నాం. వాటిని అత్యంత నాణ్యతతో చేపట్టి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా లక్ష్యం.మా నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత నిచ్చి ఎస్టీపీలను , లింక్ రోడ్లను మంజూరు చేసిన ప్రభుత్వానికి ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.