ఏండ్ల తరబడి సమస్యలతో అల్లాడిపోయిన గాయంవారిగూడెం గ్రామస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం వరంలా మారింది. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పంచాయతీ పాలకవర్గం ప్రగతికి బాటలు వేసింది. నిధులను సద్వినియోగం చేసుకొని మౌలిక వసతులు కల్పించింది. ఆవాస గ్రామాలైన టీకం తండా, బంగారు తండాలను సైతం తీర్చిదిద్దింది. పారిశుధ్యం, పచ్చదనానికి ప్రాధాన్యమిస్తూ చేపట్టిన పనులతో గ్రామం అంతా నేడు ఆహ్లాదకరంగా మారింది. పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, వీధుల్లో సీసీ రోడ్లు, విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు.. వెరసి పంచాయతీ ప్రగతి తోరణం అల్లుకున్నది.
పల్లెప్రగతిలో చేసిన పనులు…
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులతో గాయం వారి గూడెం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
రూ.11లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించారు.
రూ.16లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. l ఎకరం విస్తీర్ణంలో రూ.22లక్షలతో రైతు వేదిక, అర ఎకరంలో రూ.12.60లక్షలతో వైకుంఠధామం నిర్మించారు.
రూ.2.5లక్షలతో సెగ్రి గేషన్ షెడ్డు, ఎకరంన్నర స్థలంలో రూ.3.5లక్షలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. ఇందులో 20రకాల 2,400మొక్కలు నాటారు. l రూ.10లక్షలతో వీధుల్లో సీసీ రోడ్లు, రూ.2లక్షలతో డ్రైనేజీ నిర్మించారు. l హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా 4,200మొక్కలు నాటారు.
పచ్చదనం, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ…
పచ్చదనం, పారిశుధ్య పనులకు ప్రాధాన్యమిస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా రోజూ ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఇంటింటికీ రెండు బుట్టలు అందించి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. ట్రాక్టర్కు మైకు ఏర్పాటు చేసి పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ శివారులో 1.5ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం గ్రామానికే వన్నెతెస్తున్నది. రూ.3.5లక్షలతో 20రకాల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. వీటిలో పూల మొక్కలు అధికంగా ఉన్నాయి.
అందరి సహకారంతో అభివృద్ధి…
గ్రామస్తుల సహకారంలో అభివృద్ధి చేస్తున్నాం. పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. పల్లె ప్రగతి నిధులతో రైతు వేదిక, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, పల్లె ప్రకృతి వనం నిర్మించుకున్నాం. హరిత హారంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం.
ఊరు శుభ్రంగా మారింది..
మా ఊర్లో వీధులన్నీ పరిశుభ్రంగా ఉంటున్నాయి. రోజూ పంచాయతీ ట్రాక్టర్ మైకులో చెప్పి ఇంటికే వచ్చి చెత్త తీసుకుపోతున్నరు. ఇంటింటికీ రెండు చెత్త బుట్టలు కూడా ఇచ్చారు. మిషన్ భగీరథ నీళ్లు రావటంతో మా కష్టాలు తీరినయి.