ఊళ్లో బడీడు పిల్లలు పక్క ఊరికి నడిచి వెళ్తుంటే ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు చలించారు. ప్రభుత్వం గ్రామానికి బడి మంజూరు చేయడంతో సొంత డబ్బుతో స్థలం కొని పాఠశాల భవనానికి అప్పగించారు.. ఆయనపేరు పేరూరి సత్యనారాయణ.ఊరు గరిడేపల్లి మండలం గానుగుబండ .తమకు అక్షర జ్ఞానం నేర్పి ఉన్నత స్థానాలకు చేర్చిన పాఠశాలల రుణం తీర్చుకుంటున్నారు కోదాడ మండలం గుడిబండ జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు. దాతలు కూడా సహకారం అందిస్తూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మౌలిక వసతులు కల్పిస్తూ ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుకుంటున్నారు.
కోదాడ రూరల్, జనవరి 27: కోదాడ మండలం గుడిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, దాతలు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. తాము చదువుకున్న పాఠశాల బాగు కోసం, విద్యార్థుల భవిష్యత్కు మౌలిక వసతుల కల్పిస్తున్నారు. గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ తుమాటి నరేశ్రెడ్డి తన తండ్రి తుమాటి వెంకట్రామిరెడ్డి జ్ఞాపకార్థం రూ.4లక్షలతో పాఠశాల విద్యార్థులకు డైనింగ్ హాల్ నిర్మించారు. 1989-90 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు రూ.75వేలతో క్లాస్ రూం, పాఠశాల పూర్వ విద్యార్థి తుమాటి వరప్రసాద్రెడ్డి తన తల్లిదండ్రులు తుమాటి సీతారావమ్మ, నాగిరెడ్డిల జ్ఞాపకార్థం రూ.2లక్షలతో కళావేదిక నిర్మించారు. మట్ట కృష్ణారెడ్డి, ఇర్ల వెంకటరాంరెడ్డి రూ.80వేలు బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో పాఠశాలలో నిర్వహించే ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందిస్తున్నారు. పాఠశాల ముఖద్వారం గేటును, ఆర్చ్ను చింతా అనంతరామిరెడ్డి ఏర్పాటు చేయగా.. స్టడీ అవర్స్లో ప్రతి సంవత్సరం పరీక్షల సమయంలో మాజీ సర్పంచ్ లక్ష్మయ్య విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్నారు. పాఠశాల జూనియర్ అసిస్టెంట్ రణబోతు పాపిరెడ్డి పాఠశాల ప్రహరీకి రెండో వైపు విద్యార్థుల సౌకర్యర్థం చిన్న గేటును నిర్మించారు.
పాఠశాల రుణం తీర్చుకోవడం ఆనందంగా ఉంది
చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకునే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలకు ఎక్కువగా పేద విద్యార్థులు వస్తుంటారు. మాఊరిలోని బడికి అన్ని హంగులు ఉండాలనే ఉద్దేశంతో కళా వేదిక నిర్మించాం. అన్ని సౌకర్యాలు కల్పించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.
దాతల సహకారం అభినందనీయం
పాఠశాల బలోపేతానికి దాతలు అందిస్తున్న సహాయ, సహకారాలు అభినందనీయం. పాఠశాలలో తెలు గు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో కలిపి 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో సౌకర్యాలు, బోధన విషయం తెలుసుకుని తమ పిల్లలను మా స్కూల్లో చేర్పిస్తున్నారు. మన ఊరు.. మనబడి కార్యక్రమంతో పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తాం.
పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం
ప్రభుత్వ పాఠశాల అంటేనే పేదల బడి. అక్కడ నిరుపేద విద్యార్థులే ఎక్కువ. ఆర్థిక స్థోమత ఉన్నవారు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో చదువుతుంటారు. పేద పిల్లలకు డబ్బులు లేక ఇంగ్లిష్ మీడియం చదువుకునేందుకు అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించాలని సర్కారు తీసుకున్న నిర్ణయం అభినందనీయం.