సూర్యాపేట టౌన్, అక్టోబర్ 16 : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి ఏటా విజయదశమి వేడుకలను సంబురంగా జరుపుకుంటున్నామని, అదే మాదిరిగా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని అంతమొందించాలనే లక్ష్యంతో నాటి ఉద్యమ రథసారధి, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ 14 ఏండ్లు పోరాడి రాష్ర్టాన్ని సాధించారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం విజయదశమిని పురస్కరించుకుని సూర్యాపేటలోని జమ్మిగడ్డలో జరిగిన వేడుకల్లో ఆయన సకుటుంబ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. ఉమ్మడి పాలకుల పక్షపాత ధోరణితో అన్ని విధాలుగా నిర్లక్ష్యానికి గురైన అన్ని రంగాలతోపాటు మన సంస్కృతీ సంప్రదాయాలకు పూర్వవైభవంతో పాటు ప్రత్యేక గుర్తింపుతో మరింత వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకుని, వాటి పరిష్కారం దిశగా నిరంతరం అభివృద్ధి పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం పరితపించే గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమాలతోపాటు నిరంతర విద్యుత్, కృష్ణా, గోదావరి జలాలతో నాడు దండుగ అనుకున్న వ్యవసాయం నేడు పండుగలా మార్చిన ఘనత కూడా సీఎం కేసీఆర్దే అన్నారు. యావత్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలతో గత ఏడేళ్లుగా కోట్లాది రూపాయల నిధులతో కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధిస్తూ రాష్ట్ర కీర్తిని దేశం నలుమూలలా చాటుతున్నారని కొనియాడారు. ప్రకృతి సైతం సహకరిస్తూ సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో పాడిపంటలతో రైతాంగంతోపాటు అన్ని రంగాలు నూతనోత్తేజంతో పండుగలను మరింత సంబురంగా జరుపుకుంటున్నారని అన్నారు.
అంబరాన్నంటిన దసరా సంబురాలు
విజయ దశమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో వేలాది మంది భక్తుల నడుమ సం బురాలు అంబరాన్నంటాయి. మంత్రి జగదీశ్రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి, సతీమణి గుంటకండ్ల సునీతాజగదీశ్రెడ్డితో కలిసి హాజరుకాగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనతంరం జమ్మిచెట్టు కింద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా సంతోషిమాత ఆలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహాల వద్ద పూజలు చేసి పండితులు ఆశీర్వచనం తీసుకున్నారు. వేడుకల సమయంలో భక్తులు, చిన్నారులు మొదలు పెద్దల వరకు మంత్రితో సెల్ఫీలు దిగేందుకు బారులు తీరారు. అనంతరం వేదికపై నుంచి శాంతికి చిహ్నంగా పావురాలు, బెలూన్లను గాలిలోకి వదిలి ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి పూజలు చేశారు.
సామూహిక విందు
పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ముస్లింలు, క్రైస్తవులకు మంత్రి ప్రత్యేకంగా సామూహిక విందు ఏర్పాటు చేశారు. వారితో కలిసి విందు ఆరగించారు. అనంతరం ముస్లింలు, క్రైస్తవులు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రికి శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందించి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జడ్పీటీసీ జీడి భిక్షం, పెద్దగట్టు ఆలయ చైర్మన్ కోడి సైదులు యాదవ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపూడి వెంకటేశ్వర్రావు, గండూరి ప్రకాశ్తోపాటు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.