యజమానులే వివరాలు పొందుపర్చుకునే అవకాశం తప్పుడు సమాచారమిస్తే జరిమానా పురపాలికల్లో కొత్త ఇండ్లు, నివాసేతర భవనాలకు సెల్ఫ్ అసెస్మెంట్ యజమానులే వివరాలు పొందుపర్చుకునే అవకాశం తప్పుడు సమాచారమిస్తే జరిమానా అధికారులకు మామూళ్లు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు.. మున్సిపాలిటీల్లో ఇంటి నంబర్ కోసం తిప్పలు. ఇలాంటి ఇబ్బందులన్నింటికీ చెక్ పెడుతూ పారదర్శక సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా కొత్త సంస్కరణలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా సెల్ఫ్ అసెస్మెంట్ విధానంతో పుర అధికారులు, సిబ్బంది, పాలకుల ప్రమేయం లేకుండా నేరుగా స్మార్ట్ ఫోన్ నుంచి సీడీఎంఏ వైబ్సైట్ ద్వారా ఇంటి నంబర్ పొందే అవకాశం కల్పించింది. కొత్త నివాస, నివాసేతర భవనాలకు సంబంధిత భవన యజమానులే కొలతలు వేసుకొని ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది.
మున్సిపాలిటీల్లో ప్రజలు ఇబ్బందులు పడుకుండా ఆన్లైన్ విధానం తీసుకొచ్చిన ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలను సైతం తీసుకుంది. యజమానులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందున కొలతల్లో తప్పులుంటే భారీ జరిమానా విధించనున్నారు. కొలతలు తక్కువగా చూపించినా, తప్పుడు డాక్యుమెంట్లు ఆన్లైన్లో పొందుపర్చినా చర్యలు తీసుకుంటారు. ఆస్తి పన్ను తక్కువ చేసుకోవాలనే ఎత్తుగడ వేస్తే సంబంధిత భవన యజమానికి వాస్తవ ఆస్తి పన్నుపై 25రెట్ల జరిమానా విధించనున్నారు. యజమానులు ఆన్లైన్లో వివరాలు పొందుపర్చిన తర్వాత మున్సిపల్, రెవెన్యూ విభాగం ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఇంటి నంబర్ల కేటాయింపులో సెల్ప్ అసెస్మెంట్ విధానం అమల్లోకి రావడంతో అవినీతి, అక్రమాలకు చెక్ పడే అవకాశం ఉన్నది.
గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి https//cdma.cgg.gov.in అని టైప్ చేసి సెల్ఫ్ అసెస్మెంట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. మున్సిపాలిటీ పేరు ఎంచుకుంటే దరఖాస్తుదారుడి ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఆధార్, ఇంటి కొలతలు, దస్తావేజులు ఆప్లోడ్ చేసి సబ్మిట్ చేయగానే నేరుగా మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లాగిన్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మున్సిపల్ మేనేజర్, కమిషనర్ లాగిన్లోకి వెళ్తాయి. వారి పరిశీలన ప్రక్రియ పూర్తి కాగానే రెవెన్యూ విభాగం ఆధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి 21రోజుల్లో ఇంటి నంబర్ కేటాయిస్తారు. దరఖాస్తుదారుడు నమోదు చేసిన వివరాల మేరకు ఆస్తిపన్ను సైతం నేరుగా ఆన్లైన్లోనే చెల్లించుకోవచ్చు.