మెహిదీపట్నం : రాత్రంతా పబ్జీ గేమ్ ఆడటం, తరచూ అనారోగ్యం ఓ యువకుడిని బలవన్మరణానికి పాల్పడేలా చేశాయి. ఈ విషాదకర ఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ నాగం రవీందర్ కథనం ప్రకారం….
నారాయణఖేఢ్ ప్రాంతానికి చెందిన పవన్కుమార్, కమల్కుమార్(25) అన్నదమ్ములు ఆసిఫ్నగర్ దత్తాత్రేయనగర్ కాలనీలో నివసిస్తున్నారు. కమల్కుమార్ సెల్ఫోన్ టెక్నిషియన్గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా గత కొన్ని నెలలుగా పబ్జీ గేమ్కు అలవాటు పడ్డ కమల్కుమార్ ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు.
ఇది భరించలేక సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసును ఎస్ఐ బుర్హాన్ దర్యాప్తు చేస్తున్నారు.