తెలుగుయూనివర్సిటీ: తెలుగు భాషా సాహిత్య రంగంలో విశేష సేవలందిస్తున్న కవి సుధామకు సాహితీ పురస్కారం అందించడం ముదావహమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరంరెడ్డి రంగనాయకమ్మ 40వ సంస్మరణ ప్రసంగం చేసిన ప్రముఖ కవి, విమర్శకులు సుధామకు సాహితీ పురస్కార ప్రధానోత్సవం పరిషత్తు ప్రాంగణంలోని ఆడిటోరియంలో మంగళవారం జరిగింది. తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనంలో సుధామ చేస్తున్న కృషిని రమణాచారి ప్రశంసించారు.
కవిగా, వక్తగా, కార్టూనిస్టుగా, కాలమిస్టుగా, యువభారతి సంస్థలో ముఖ్యమైన కార్యకర్తగా కృషి చేస్తున్నారన్నారు. సుధామ అక్షరం తెలుగు సాహిత్యంలో అందంగా ఉంటుందని అవసరాన్ని బట్టి వాగ్మిగానూ, మౌనిగాను ఉండగలడని రమణాచారి పేర్కొన్నారు. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరిశివారెడ్డి మాట్లాడుతూ ఓయు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షురాలు డాక్టర్ పి.సుమతీ నరేంద్ర అమ్మమ్మ ఎరంరెడ్డి రంగనాయకమ్మ స్మృత్యర్థం 40సంవత్సరాల కిందట పరిషత్తులో నెలకొల్పిన ఎండోమెంట్ నుంచి ఏటా ఈ పురస్కారాన్ని ప్రధానం చేస్తున్నట్లు వివరించారు.
తెలుగు భాషా సాహిత్యాలలో సుధామ గర్వపడే స్థాయికి చేరుకున్నారన్నారు. ఈ సందర్బంగా పురస్కారాన్ని అందుకున్న సుధామ పదబంధ పారిజాతం అనే అంశంపై ప్రసంగం చేశారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, కోశాధికారి మంత్రి రామారావు డాక్టర్ పి.సుమతీ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.