భువనగిరి అర్బన్, ఏప్రిల్ 5 : దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ 115వ జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని జగ్జీవన్రామ్ చౌరస్తాలో దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. అంతకు ముందు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ జగ్జీవన్రామ్ తన తుది శ్వాస వరకూ దేశానికి అకుంఠిత సేవచేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దేశానికి అందించిన సేవలకు మనం గర్వ పడాలని, మన గ్రామం, దేశం బాగుపడాలనే చిత్తశుద్ధి, తపన ప్రతి ఒక్కరిలోనూ ఉండాలన్నారు. బాబూ జగ్జీవన్రామ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా సంస్కరణలు అమలు చేస్తున్నారని కొనియాడారు. షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్విజయంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. ఎస్సీ, బీసీ వర్గీకరణకు అసెంబ్లీ, శాసన మండలిలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. దళితబంధు పథకం ద్వారా ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసాలమర్రిలో 76 కుటుంబాలకు రూ.7.60కోట్లతో పలు పథకాల గ్రౌండింగ్ జరుగుతుందన్నారు. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగాలని పిలుపునిచ్చారు.
ఆత్మకూర్(ఎం) మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన నలుగురిలో ఇద్దరికి డోజర్లు, ఇద్దరికి ట్రాక్టర్లు, ఇద్దరికి కలిపి ఒక డీసీఎం, వాసాలమర్రి గ్రామానికి చెందిన మరొకరికి ట్రాక్టర్ను పంపిణీ చేశారు. అదే విధంగా కులాంతర వివాహం చేసుకున్న ముగ్గురికి రూ.2.50లక్షల చొప్పున రూ.7.50లక్షలు, వ్యాపారం నిర్వహించుకుంటున్న 21 మందికి రూ.50వేల చెక్కులు, మరో 49మందికి దళితబంధు మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, దీపక్తివారీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అమరేందర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, జిల్లా షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జినుకల శ్యామ్సుందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, జడ్పీ వైస్ చైర్మన్ బీకూ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఆర్డీఓ భూపాల్రెడ్డి, అఖిల పక్ష నాయకులు పోత్నక్ ప్రమోద్ కుమార్, బట్టు రాంచంద్రయ్య, బర్రె జహంగీర్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
బాబు జగ్జీవన్రామ్ కుల మతాలకతీతంగా హక్కుల కోసం పోరాడిన మహనీయుడు. ఆయన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. దళితులకు చేయూత అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. వాటన్నింటినీ సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలి.
– ఎలిమినేటి సందీప్రెడ్డి, జడ్పీ చైర్మన్
ఐదు దశాబ్దాల దేశ సేవలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎంచుకున్న లక్ష్యాలను సాధించిన బాబు జగ్జీవన్రామ్ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన ఆశయసాధన కోసం నిరంతరం కృషి చేయాలి. రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగి ఫలితాలను అనుభవించాలి. దళితులు ఆర్థికంగా బాగుంటేనే దేశం బాగుంటుంది.
– పైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి