రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై భారీ వ్యయంతో నిర్మిస్తున్న సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ పనులను మే నాటికి పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద రూ.3,480 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బరాజ్ పనులను శనివారం వారు పరిశీలించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్రెడ్డి, ఎల్అండ్టీ సీఈవో సుబ్రహ్మణ్యంతో కలిసి వచ్చారు. తొలుత ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం వాటి గురించి ఇరిగేషన్, ఎల్అండ్టీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సైట్ వద్దకు వెళ్లి పనులను పరిశీలించారు.
మణుగూరు రూరల్, జనవరి 22: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై భారీ వ్యయంతో నిర్మిస్తున్న సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ పనులను మే నాటికి పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద రూ.3,480 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బరాజ్ పనులను శనివారం వారు పరిశీలించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్రెడ్డి, ఎల్అండ్టీ సీఈవో సుబ్రహ్మణ్యంలతో కలిసి వచ్చారు. తొలుత ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం వాటి గురించి ఇరిగేషన్, ఎల్అండ్టీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సైట్ వద్దకు వెళ్లి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానకాలంలో నిర్మాణ పనులకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, మే నెల ఆఖరు నాటికి అన్ని పనులూ పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరిగేందుకు యంత్ర సామగ్రిని, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రాజెక్టుకు 40 కిలోమీటర్ల మేర కుడి కాల్వ, 50 కిలోమీటర్ల మేర ఎడమ కాల్వ నిర్మించాల్సి ఉన్నందున పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సెక్యూరిటీ బండ్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. 65 గేట్లు ఏర్పాటు చేయనున్న ప్రాజెక్ట్ ద్వారా భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.45 లక్షల ఎకరాలకు సీతమ్మ ఎత్తిపోతల పథకం ద్వారా నిరంతరం సాగు నీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని పనులను వేగవంతం చేయాలని సూచించారు. సీఏ భూముల అప్పగింత వివరాలను కలెక్టర్ అనుదీప్ ద్వారా తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏర్పాటు చేయనున్న యంత్రాల వేడి నుంచి రక్షణకు ఐస్ప్లాంట్స్ నిర్మించాలని సూచించారు. అనంతరం ఎల్అండ్టీ అతిథిగృహంలో జరిగిన సమీక్షలో మాట్లాడారు. నిర్మాణ పనుల్లో ఇబ్బందులుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకొని షెడ్యూల్ ప్రకారం పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 63 గ్రామాల పరిధిలో 3121.14 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటివరకు 2485.18 ఎకరాల భూమి ఇరిగేషన్ శాఖకు అప్పగించామన్నారు. మిగిలిన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలన్నారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్లారు. ఈ సమావేశంలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, ఐటీడీఏ పీవో పోట్రు గౌతం, ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి, ఎస్ఈలు వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎల్అండ్టీ డీజీఎం రజనీశ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.