ఉమ్మడి పాలమూరు జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పథకాల అమలుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ఎంజీకేఎల్ఐ పంప్ హౌస్లోకి నీళ్లు వచ్చే ఇన్ ఫాల్ రెగ్యులేటర్ నిర్మించాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కోయిల్సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టును తాగునీటికి సైతం కేటాయించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.
మహబూబ్నగర్, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా నిలిచిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పథకాల అమలు తీరుపై జరిగిన సమీక్షలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొన్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లాపై సీఎం కే సీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. దేశం మొత్తంలో ఆదర్శ గ్రామాలున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వెల్లడించారు. నల్లాల ద్వారా నీటి సరఫరా, ఫ్లోరైడ్ రహిత తాగునీరు, 100 శాతం పాఠశాలల్లో నీరందిస్తున్న రాష్ట్రం కూడా మనదేనన్నారు. పల్లె ప్రగతి, నిరంతరం పారిశుద్ధ్యం, కరోనా నివారణ టీకాలు వంటి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగాలని ఎర్రబెల్లి ఆకాంక్షించారు. పంచాయతీ కార్యదర్శులు 7గంటలకే గ్రామాల్లో విధుల్లో ఉండాలన్నారు. ఎమ్మెల్యేలు మండలాల వారీగా నియోజకవర్గం సమీక్షలు జరపాలన్నారు. ఉపాధిహామీ నిధులను విరివిగా వా డుకోవాలని సూచించారు. తాజాగా పంచాయతీ భవనాలు, కాలువల పూడిక తీత వంటి పనులకు కూడా ఉపాధి నిధులను వినియోగించుకోవాలని అధికారులకు తెలిపారు. మార్చిలోగా సాధ్యమైనంత ఎక్కువ ఉపాధి పనులు చేయాలని ఆదేశించారు. త్వరలోనే మరిన్ని సీసీ, బీటీ రోడ్లు, మురుగునీటి కాలువలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. వైకుంఠధామాలను దేవాలయాల్లా తీర్చిదిద్దాలని కోరారు. పూలమొక్కలతో ఫెన్సింగ్ చేయాలని, పూర్తయిన వాటిని వెంటనే అందుబాటులోకి తేవాలన్నారు. అడిగిన వాళ్లందరికీ ఒక రోజులోనే జాబ్కార్డు అందించి ఉపాధి పనులు కల్పించాలన్నారు. డంపింగ్ యార్డుల్లో చెత్త ద్వా రా తీసిన ఎరువుల అమ్మకం ద్వారా రాష్ట్ర వ్యా ప్తంగా పంచాయతీలకు రూ.300 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. పాఠశాలల్లో నర్సరీలను ఏర్పాటు చేసి, ప్లాంటేషన్ పెడితే, గ్రామ పంచాయతీలకు భారం తగ్గుతుందని మంత్రి సూచించా రు. కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన గ్రామ పంచాయతీలు, ఎస్సీ రిజర్వు గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై సీఎం ఆదేశానుసారం నడుచుకుంటామన్నారు. కొత్త రోడ్లు, మురుగునీటి కాలువల పనులు కూడా త్వరలోనే వస్తాయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. గ్రామ కార్యదర్శులకు జియో ట్యా గింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి జిల్లాలో కార్యదర్శులు, అధికారులు మరికొంత అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించిందని, ఈ అరుదైన ఘనత, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాల ద్వారా సాధ్యమైందన్నారు. దీన్ని నిలబెట్టుకోవడం మన విధి అని మంత్రి చెప్పారు. సమీక్షలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు చర్లకోల లక్ష్మారెడ్డి, మహేశ్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహం, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, క్రాంతి కిరణ్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్, పీఆర్ఈఎన్సీ సంజీవరావు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, జిల్లాకు చెందిన ఆయా శాఖల ఎస్ఈలు, ఈఈలు, డీఆర్డీవోలు పాల్గొన్నారు.
కోయిల్సాగర్ నుంచి తాగునీరు అందించాలి
ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్
గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు కోయిల్సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టును తాగునీటికి సైతం కేటాయించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. మన్యంకొండ ఆలయం వద్ద మిషన్ భగీరథ ట్రీట్మెంట్ కోసం వాటర్ ట్యాంక్ నిర్మించామన్నారు. ఇక్కడ తాగునీటిని శుద్ధి చేసిన తర్వాత మిగిలే వృథా నీటిని సమీపంలోని చెరువులకు వదలాలని కోరారు. ఈ మేరకు అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గురించే చెప్పారని.. అందుకు తగ్గట్లుగానే నిధుల కేటాయింపు సైతం అధికంగా ఉండాలని కోరారు. వివిధ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే క్లియర్ చేయాలన్నారు. సీఎం ఆదేశించిన విధంగా పనులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు చెప్పే పనులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి మైదానాలు నిర్మించాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నామన్నారు. ఈ క్రీడా పాలసీలో గ్రామీణ క్రీడలకు, కోచ్లను ప్రోత్సహించేందుకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు.
‘ఉపాధి’లో కాలువలు పూడిక తీయాలి
వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్రెడ్డి
ఉపాధిహామీ కింద కాలువల పూడిక తీ యాలని, కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ లో కి నీళ్లు వచ్చే ఇన్ ఫాల్ రెగ్యులేటర్ వెంటనే ని ర్మించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెగ్యులేటర్ పనులు చేపట్టాలని గతంలోనే ఆదేశించారని గుర్తు చేశారు. ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్ కాలువల పూడిక తీయడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉపాధిహా మీ కింద పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రూరల్ వాటర్ సప్లయిలో సంబంధిత ఏజెన్సీలలో క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సం ఖ్య పెంచి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణంలో దెబ్బతిన్న సీసీ రహదారులు వెంటనే సరిచెయ్యాలని.. లేని పక్షంలో గ్రామ పంచాయతీలకు అప్పగించాలన్నారు. పీఎంజీఎస్వై రహదారుల నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. వైకుంఠధామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డంపింగ్ యార్డులను క్రమపద్ధతిలో నిర్వహించాలన్నా రు. పల్లెప్రకృతి వనాలను అద్భుతంగా నిర్మించారన్నారు. ఎస్టీ కాలనీల్లో సీసీ రహదారులు, మురుగుకాలువల నిర్మాణం, కరెంట్ సమస్య లు, తాగునీటి సరఫరా ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రయోగాత్మకంగా స్పెషల్ డ్రై వ్ కింద చేపట్టాలన్నారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో రాష్ట్రంలో వనపర్తి అగ్రభాగాన ని లిచిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎస్టీ గ్రామ పంచాయతీల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి అవకాశం ఇవ్వాలని కోరారు.