మియాపూర్ : సమాజానికి తమ వంతు సేవ చేయాలన్న తలంపు అభినందనీయమని, ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు స్వచ్చంద సంస్థలు సైతం చేదోడు వాదోడుగా ప్రజలకు అండగా నిలుస్తుండటం శుభ పరిణామమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో పీజేఆర్నగర్లో ఖార్డ్ స్వచ్చంద సంస్థ నిర్వహకులు మల్లాది సుమన్, మల్లాది మంజులత ఆధ్వర్యంలో యూబీఎస్ సంస్థ ప్రతినిధులు ఎండి సమర్ సింగ్, పద్మనాభంల తోడ్పాటుతో వికలాంగులకు మూడు చక్రాల బండి, పేద మహిళలకు కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, తోపుడు బండ్లు, నిత్యావసర సరుకులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్తో కలసి విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సమాజంలో విభిన్న అవసరాలున్న ప్రజలను గుర్తించి వారికి స్వచ్చంద సంస్థలు అండగా నిలుస్తుండటం హర్షనీయమన్నారు. ఖార్డ్ సంస్థ ఈ తరహా సేవలో విజయవంతంగా ముందడుగు వేస్తుండటం సంతోషకరమని, ఇలాంటి సేవలను మిగిలిన వారూ స్ఫూర్తిగా తీసుకోవాలని విప్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు సమ్మారెడ్డి, శ్రీనివాస్, కాశీ,గణేశ్, మోజెస్, వాసు,వెంకట్, రాములు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.