సిద్దిపేట, జనవరి 14 : స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్-2లో భాగంగా దేశవ్యాప్తంగా ‘సంపూర్ణ స్వచ్ఛత’ సాధించేందుకు మీ పనితీరు లక్ష్యాల సాధనకు ప్రేరణ ఇస్తుంది.. తాగునీటి సరఫరా, పారిశుధ్య విభాగాల్లో సిద్దిపేట జిల్లా రాబోయే రోజుల్లో అద్భుత పనితీరును కనబరుస్తూ దేశంలోని మిగతా జిల్లాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర తాగునీరు, పారిశుధ్య విభాగం, జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రెటరీ అరుణ్ బరోక అభినందన లేఖలో పేర్కొన్నారు. జాతీయ స్థాయి లఘు చిత్రాల పోటీ స్వచ్ఛ ఫిల్మోన్ కా అమృత్ మహోత్సవ్ 2021లో భాగంగా జిల్లా సాధించిన ప్రగతి ఫలితాలను తెలుపుతూ జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పర్యవేక్షణలో 160పైగా చిత్రాలను రూపొందించి స్వచ్ఛమిషన్ లఘు చిత్రాల పోటీకి పంపించారు. వీటిని వీక్షించిన అరుణ్ బరోక అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నట్లు జిల్లా యంత్రాంగానికి పంపిన లేఖలో తెలిపారు.
మంత్రి హరీశ్రావు మార్గదర్శనంతోనే జిల్లాకు ప్రత్యేక గుర్తింపు
రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మార్గదర్శనంతోనే సిద్దిపేట జిల్లాలోని గ్రామాలు దేశంలోని మిగతా గ్రామాలకు అన్ని రంగాల్లో స్ఫూర్తిగా నిలుస్తాయి. స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం.. అదనపు కలెక్టర్ ముజామ్మిల్ పర్యవేక్షణ.. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ అధికారుల ప్రత్యేక చొరవతో పల్లెల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జిల్లాకు ప్రశంసలు రావ డం మనందరికీ గర్వకారణం.
-హనుమంతరావు, కలెక్టర్, సిద్దిపేట
సమిష్టి కృషి ఫలితంగానే దేశవ్యాప్త గుర్తింపు
స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యం, క్షేత్రస్థాయి సిబ్బంది కృషి, ప్రజల సహకారంతో జిల్లాలోని గ్రామాలు, పల్లెలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నాం. ముఖ్యంగా తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణలో సాధించిన ఫలితాలు.. ప్రజాప్రతినిధులు అధికారుల పనితీరు దేశంలోని మిగతా గ్రామాలకు ప్రేరణ ఇస్తుందని కేంద్రం పేర్కొనడం మనందరికీ గర్వకారణం. ఇదే స్ఫూర్తితో భవిష్యత్లో మరింత ఉత్సాహంతో పనిచేయాలి. కలెక్టర్, స్థానికసంస్థల అదనపు కలెక్టర్కు నా ప్రత్యేక అభినందనలు.
-రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు