సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 25 : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధు లు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సిద్దిపేట జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, వైద్యశాఖ అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాధుల సమాచారం, బాధితుల వైద్య సేవల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 14 డెంగీ కేసులు నమోదయ్యాయని, చికున్గున్యా, మలేరియా కేసులు నమోదు కాలేదని జిల్లా వైద్యాధికారి మనోహర్ తెలిపారు. వైరల్ ఫీవర్ కేసులు అధికంగా నమోదవుతున్నట్లు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ సీజనల్ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అనుమానితులకు తక్షణమే జ్వర పరీక్షలు చేసి నిర్ధారించుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు, చికిత్సకు సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జిల్లాలో వైరల్ ఫీవర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లు నివేదికలు అందాయన్నారు. చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో జ్వర బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందన్నా రు. వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందకుండా అన్ని మున్సిపాలిటీల్లో ప్రజల భాగస్వామ్యంతో ఆదివారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్లు, అధికారులు పారిశుధ్య సిబ్బంది ప్రత్యేక డ్రైవ్లో తప్పకుండా భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్లో భాగస్వాములై వైరల్ జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సోమవారం నుంచి వైరల్ జ్వరాలు తగ్గే వరకూ అదనపు కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విధిగా డ్రైవ్ చేపట్టాలన్నారు. ఇంటి పరిసరాలు, సామూహిక ప్రదేశాల్లో మురుగు, వర్షపు నీరు నిల్వకుండా చూడాలన్నారు. వర్షాకాలం ముగిసే వరకూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ఆదివారం అన్ని మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూస్తామన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్కుమార్, రఘునందన్రావు, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ పాల్గొన్నారు.