అందోల్, సెప్టెంబర్ 17: ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నా రు. శుక్రవారం అందోల్-జోగిపేట మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. జడ్పీ చైర్పర్సన్ నేరడిగుంట, చింతకుంట, కన్సాన్పల్లి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. మున్సిపల్తోపాటు గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, యువకులు ప్రజలకు అవగాహన కల్పించి, గ్రామాల్లో 100శాతం వ్యాక్సిన్ వేసుకునేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలయ్య, ఎంపీడీవో సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తానని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. మండలంలోని నేరడిగుంట, చింతకుం ట గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను ఆమె తెలుసుకున్నారు. పాఠశాలల్లో తగరతి గదులను శుభ్రంచేసి, శానిటైజ్ చేయాలన్నారు. నేరడిగుంట పాఠశాలలో తరగతి గదుల కొరత ఉన్నదని, మౌ లిక వసతులు అవసరం ఉన్నాయని విద్యార్థులు, స్థానిక నేతలు ఆమె దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పిస్తానని ఆమె హామీనిచ్చారు.