శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు
నేటి నుంచి మూడురోజుల పాటు జాతర
పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులు
దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసంలో శివపూజలకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజిస్తారు. శ్రావణమాసంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదర్పల్లి ‘దుబ్బరాజేశ్వరుడి’ దేవాలయం భక్తుల సందడితో నెలకొంటుంది. ఆలయంలో నిత్య పూజలతో పాటు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. శ్రావణమాసంలో చివరి శని, సోమవారం దేవాలయం వద్ద జాతర కొనసాగుతుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల్ల, హైదరాబాద్ జిల్లాల నుంచి భారీగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. శ్రావణంలో దుబ్బరాజేశ్వరుడిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు తరలివస్తారు.
ఆలయ చరిత్ర..
సుమారు నాలుగు శతాబ్దాల కిందట చౌదర్పల్లిలో పార్వతీసమేత దుబ్బరాజేశ్వరుడు స్వయంభూ లింగంగా వెలిసినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఈ ప్రాంతంలో శివభక్తుడైన ఓ రైతు తన పొలం దున్నుతుండగా నాగలికి శివలింగం తగిలింది. భూమిలో నుంచి శివలింగాన్ని చూసి ఆ భక్తుడు సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వచ్చి చూసే సరికి పుట్టలో నుంచి (దుబ్బలో నుంచి) శివలింగం బంగారు వర్ణంతో దర్శనమిచ్చింది. దుబ్బలో నుంచి వచ్చిన స్వయంభూ లింగం కావడంతో దుబ్బరాజేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.
కోరిన కోరికలు తీర్చే దుబ్బరాజేశ్వరుడు..
భక్తిశ్రద్ధలతో కొలిచిన భక్తులకు కోరిన కోరికలు తీర్చుతూ దుబ్బరాజేశ్వరుడు కొంగు బంగారమవుతున్నాడు. కోరికలు తీర్చిన స్వామికి ఉపవాస దీక్షతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. సంతానం లేనివారు ఈ ఆలయానికి వచ్చి మొక్కుకుంటే సంతానప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి చేసి సుఖసంతోషాలను కలిగిస్తున్నందుకు దుబ్బరాజేశ్వరాయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దుబ్బాక నియోజకవర్గంలో చాలా మందికి దుబ్బరాజేశ్వరస్వామి యొక్క నామకారణాలు ఉంటాయి. దుబ్బయ్య, దుబ్బరాజం, దుబ్బవ్వ, రాజేశం, రాజయ్య, రాజవ్వ తదితర నామధేయం కలిగి ఉన్నారు.
ఆలయానికి బస్, ఆటో సౌకర్యం..
దుబ్బరాజేశ్వరాలయానికి వచ్చే భక్తులు సిద్దిపేట నుంచి రామయంపేటకు వెళ్లే దారిలో భూంపల్లి చౌరస్తాలో దిగాలి. అక్కడి నుంచి 4 కి.మీ దూరంలో చౌదర్పల్లి దుబ్బరాజేశ్వరాలయానికి ఆటోలు ఉంటాయి. దుబ్బాక నుంచి బస్, ఆటో సౌకర్యం ఉంటుంది.
భక్తులకు వసతులు కల్పించాం..
దేవాలయానికి వచ్చే భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేశాం. ఆలయం పక్కనే భక్తులు ఉండేందుకు వసతి గదులు ఉన్నాయి. భోజనం, తాగునీటి సౌకర్యం ఉంది. ప్రత్యేక పూజలకు వచ్చిన భక్తులు పూజలు నిర్వహించుకుని స్వామివారి సన్నిధిలో నిద్రించేందుకు వసతి గదులు, ప్రాంగణం ఉంది. ప్రతి సోమ, శనివారాల్లో ఆలయానికి భారీగా భక్తులు వస్తుంటారు. శ్రావణమాసంలో నెలరోజుల పాటు భక్తుల సందడి ఉంటుంది. ఈ మాసంలో అఖరి శని, సోమవారాల సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఆలయం వద్ద జాతర కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అన్నదానం చేస్తున్నాం.