ఆర్కేపురం : సరూర్నగర్ ప్రాథమిక పశువైద్యశాల శిథిలావస్థలో ఉంది. ఐదు దశాబ్దాలుగా సేవలందించిన పశువైద్యశాల శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది. పెంపుడు జంతువుల బాగోగులు చూసుకుంటున్న వారి నుంచి ఆదరణ పెరుగుతున్నా సౌకర్యాలు పేరగడం లేదు. పశువైద్యశాల భవనం నిర్మించిన నాటి నుంచి నేటి వరకు భవనం ఆధునీకరణకు,అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో భవనం శిథిలావస్తకు చేరింది.
ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్, సిబ్బంది ఎప్పుడు కూలుతుందో తేలియని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. అసలే వర్షాకాలం కావడంతో ఎప్పుడు కూలుతుందోనని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
ఈ దవాఖానకు ప్రతి రోజు వైద్యం కోసం 60నుంచి 70 శునకాలను తీసుకొస్తుంటారు. ఇక్కడకు బైరామల్గూడ, సరూర్నగర్, ఎల్బీనగర్, మన్సూరాబాద్, ఖర్మన్ఘాట్, కొత్తపేట, చంపాపేట్, గడ్డిఅన్నారం, లింగోజీగూడ నుంచి ప్రజలు శునకాలను, ఇతర జంతువులను తీసుకొచ్చి వైద్యం చేయిస్తుంటారు. ఈ ప్రాంతాలకు ఇదే కేంద్రంగా ఉంది. పెంపుడు జంతువు జన్మించిన నాటి నుంచి అవి పెద్దవయ్యేదాక వైద్య సేవలు ఇక్కడే తీసుకుంటారు.
అటువంటి ఉత్తమ సేవలందిస్తున్న వైద్యశాల కూలేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయంపై పశువైద్యాధికారి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎటువంటి స్పందన రాలేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి శిథిలావస్థలో ఉన్న భవనం స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
నూతన భవనాన్ని నిర్మించాలి : పశువైద్యాధికారి డాక్టర్.కిరణ్ కుమార్, సరూర్నగర్
శిథిలావస్థలో ఉన్న భవనాన్ని ఆధునీకరించడమా, లేక నూతన భవనాన్ని నిర్మించాలని మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రతి రోజు ఇక్కడ 60 నుంచి 70 వరకు జంతువులకు వైద్య సేవలందిస్తున్నాం. 1974లో నిర్మించిన ఈ భవనం 1995 నుంచి పశువైద్యశాల నిర్వాహణకు అమల్లోకి వచ్చింది.
నాటి నుంచి నేటి వరకు భవనం ఎలాంటి ఆధునీకరణకు నోచుకోలేదు. చుట్టు పక్కల ప్రాంతాల జంతు ప్రేమికులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్న పశువైద్యశాల భవనం స్థానంలో నూతన భవనాన్ని నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.