కొత్తగూడెం అర్బన్, జనవరి 22 : సంక్రాంతి పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీకి ప్రత్యేక బస్సుల ద్వారా రూ.35 లక్షల ఆదాయం సమకూరింది. ఈ నెల 7వ తేదీ నుంచి 19వరకు కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి ఈ మూడు డిపోలకు బస్సులను నడిపింది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో ఆర్టీసీ అధికారులు వచ్చే నెలలో మేడారం జాతర కోసం బస్సులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మేడారం జాతరకు మరింత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆర్టీసీ అన్వేషిస్తున్నది. ఆదాయంతోపాటు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు దృష్టి సారించింది.
అదనపు చార్జీలు లేకుండానే..
సాధారణంగా సంక్రాంతికి ఆర్టీసీ అదనపు చార్జీలను వసూలు చేస్తుంది. ఈసారి మాత్రం సాధారణ చార్జీలనే వసూలు చేసి ప్రయాణికుల సౌకర్యమే ముఖ్యమని నిరూపించారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. పండుగ సందర్భాల్లో అదనపు చార్జీలను వసూలు చేసినప్పటికీ ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. కానీ ఈ ఏడాది అదనపు చార్జీలను వసూలు చేయవద్దని నిర్ణయించడంతో గతేడాది కంటే ఆదాయం కొంత తక్కువ వచ్చింది. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేయడంలో ఆర్టీసీ ముందజలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల నుంచి హైదరాబాద్కు 168 ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేయగా రూ.35,65,678 ఆదాయం సమకూరింది. కొత్తగూడెం డిపో నుంచి 57 బస్సులను ఆపరేట్ చేయగా 9,35,753, భద్రాచలం డిపో నుంచి 88 బస్సులను ఆపరేట్ చేయగా రూ.21,15,933, మణుగూరు డిపో నుంచి 23బస్సులను ఆపరేట్ చేయగా రూ.5,13,992 ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఆర్టీసీని సద్వినియోగం చేసుకోవాలి
సంక్రాంతికి ఆశించిన ఆదాయం సమకూరింది. వచ్చే నెలలో మేడారం జాతర కోసం కూడా భక్తులకు ప్రత్యేకంగా బస్సులను నడుపనున్నాం. ఆర్టీసీ బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. 50మంది ఉండి బస్సు కావాలనుకునేవారు డిపోలో సంప్రదిస్తే వారి వద్దకే పంపిస్తాం. ఆర్టీసీని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది.