జహీరాబాద్, అక్టోబర్ 17 : జహీరాబాద్ను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతవాసుల ఆక్షాంక్ష నెరవేరి ఐదేళ్లయింది. ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ వివిధ రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఆరోవసంతంలోకి ఆడుగు పెట్టింది. జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ను జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాలతో ఏర్పడి అన్ని రం గాల్లో ముందుకు సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, వృద్ధులు, యువకులు, బాలికలు, రైతులు కార్మికుల అభ్యున్నతికి వివిధ పథకాలు ప్రవేశట్టి అభివృద్ధికి కృషి చేస్తుంది. వ్యవసాయం ప్రధానమైన ఈ ప్రాంతంలో పారిశ్రామిక రంగంలో కూడా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. విద్య, వైద్య రంగం మెరుగు పడింది. జహీరాబాద్లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మె ల్సీ ఫరీదుద్దీన్ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు..
జహీరాబాద్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి ఆర్డీ వో, డీఎస్పీలను ప్రభుత్వం నియమించింది. దీంతో ప్రజలకు ప్రభుత్వ పాలన అందుబాటులోకి వచ్చింది. డివిజన్ అభివృద్ధి కోసం అధికాలు ప్రతిరోజూ పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన వారికి అందించేందుకు కృషి చేస్తున్నారు.
మారుతున్న జహీరాబాద్ రూపురేఖలు..
కొత్తగా రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయడంతో జహీరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. జహీరాబాద్ పట్టణంలో కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టింది. పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ చేపట్టారు. పట్టణ ప్రగతిలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేశా రు. రైతులు పంటల సాగులో అవగాహన కల్పించేందుకు రైతు వేదికలు నిర్మించారు.
పారిశ్రామికంగా అభివృద్ధి..
తెలంగాణ ప్రభుత్వం జహీరాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నది. నిరుద్యోగులకు ఉపాధి క ల్పించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ యూ నిట్ ఏర్పాటు చేయడంతో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి దొరికింది. గోవింద్పూర్ శివారులో హాట్సన్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నారు. ఈ ఏడాది చివరి వరకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఝరాసంగం, న్యాల్కల్ మండలంలో నిమ్జ్ ఏర్పాటు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. నిమ్జ్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే రైతులు, వ్యవసాయ కూలీల కుటుంబాల్లోని యువతకు ఉపాధి దొరుకుతున్నది. నిమ్జ్లో వ్యవసాయ పంట ఉత్పత్తులను ప్యాకింగ్ చేసేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూ నిట్ల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
మెరుగైన వైద్య సేవలు..
జహీరాబాద్ సర్కారు దవాఖాన స్థాయిని వంద పడకలకు పెంచి వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేసి అత్యవసర రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి మెరుగైన సౌకర్యం కల్పించారు. ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా నేపథ్యంలో సర్కారు దవాఖానలో 70 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశా రు. అన్ని పడకలకు ఆక్సిజన్ అందించేందుకు ప్లాంట్ను నెలకొల్పారు.
జహీరాబాద్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం
జహీరాబాద్ నియోకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చింది. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఐసీయూ కేంద్రం, ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు, ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసింది.