బడంగ్పేట : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దావుత్ ఖాన్ గూడలో పుట్ పాత్లను తొలగిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ పై ఆక్రమణ దారులు దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. బడంగ్పేట కమాన్ నుంచి నాదర్గుల్ వరకు రోడ్డు విస్తరణలో భాగంగా పుట్ పాత్లను తొలగిస్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత నెల కొన్నది.
ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు నిర్మించడమే కాకుండా తమ పై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమణ దారులు దౌర్జన్యం చేయడం, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని ఆయన అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు ఎలా నిర్మించారని ఆక్రమణదారులను ఆయన ప్రశ్నించారు. తప్పులు చేయడమే కాకుండా దాడులు చేస్తారా? అంటు ఆయన మండిపడ్డారు. రెండు రోజుల్లో ఎవరికీ వారు తొలగించుకోక పోతే కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు.