శేరిలింగంపల్లి : నగరంలోని పురాతన, చారిత్రాత్మిక బావులను సంరంక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు, సాహీ సోసైటీల సంయుక్త అధ్వర్యంలో చిరెక్ పభ్లిక్ పాఠశాల సౌజన్యంతో గచ్చిబౌలిలో పునరుద్ధరించిన ‘‘పురాతన, చారిత్రాత్మిక మెట్ల బావి’’ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో నగరంలో 150 చారిత్రాత్మక, పురాతన బావులు ఉండేవని అన్నారు. వాటిలో చాల వరకు నేడు కనుమరుగయ్యయని, మిగిలి ఉన్న పురాతన బావులను సంరక్షించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతుందని అన్నారు.
ఇందులో బాగంగానే మొండా మార్కెట్, మిరాలంమండీ, లాల్బజార్ల బావుల పునరుద్ధరణ చర్యలు చేపట్టడం జరిగింద ని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సంక్షేమ సంఘాలు, కార్పొరేట్ విద్యాసంస్ధలు ఈ తరహా కార్య క్రమాలకు ముందుకు రావాలని సూచించారు. గచ్చిబౌలిలోని మెట్ట బావి పునర్ధురణకు ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు, సాహి సంస్థలతో కలిసి చిరెక్ పబ్లిక్ స్కూల్ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు.
రాష్ట్ర వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ వీ.ప్రకాశ్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం బౌలి, బాగ్ లకు పేరోందినదని, బౌలిలు బాగ్లు నగరంలో చాల ఉన్నాయన్నారు. పురాతన బావులు చాల వరకు కనుమరుగయ్యాయని, మిగిలిఉన్న వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ప్రభుత్వంపై భారం వేయకుండా స్వంతంగా పునరుద్దరణ, సంరక్షణ చర్యలకు ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు ప్రతినిధి కల్సన రమేష్ ముందుకు రావడం శుభపరిణామమన్నారు.
ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు వ్యవస్ధాపకురాలు కల్పన రమేష్ మాట్లాడుతూ నగరంలో అంతరించిపోతున్న భూగర్భజలాల పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు మనందరం చర్యలు చేపట్టాలని అన్నారు. కోకాపేట్లో ఓ గోశాల, కొండాపూర్లో పురాతన బావి, గచ్చిబౌలిలో మెట్లబావి, బన్సీలాల్పేట్ లాంటి ప్రాంతాల్లో పురాతన, చారిత్రాత్మిక బావుల పునరుద్దరణకు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.
గచ్చిబౌలి ప్రాంతానికి ఈ బావి నుంచే ఆ పేరు వచ్చిందని దానిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ కమిషనర్ ప్రియంకా ఆల, భూగర్బ జలాల శాఖ డైరక్టర్ పండిత్, చిరెక్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సంచిత, శేరిలింగంపల్లి ఉపకమిషనర్ వెంకన్నలతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.