అమీర్పేట్ : ఎస్ఆర్నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు వీధి దీపాలు లేకపోవడంతో ఈ మార్గంలో రాత్రి సమయాల్లో చిమ్మచీకట్లు అలుముకుంటున్నాయి. దీంతో ఈ మార్గంలో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
కాగా ఈ మార్గంలో మోడ్రన్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటూ బాపూనగర్ బస్తీ సంక్షేమ సంఘం అధ్యక్షులు హరిసింగ్జాదవ్ మంత్రి తలసానికి లిఖిత పూర్వక విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి తలసాని వెంటనే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్కు ఫోన్ ద్వారా విషయాన్ని వివరించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు.
ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎలక్టికల్ విభాగం ఈఈ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఈ కిరణ్మయిలు ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఉమేష్చంద్ర విగ్రహం చౌరస్తా నుండి ట్రాఫిక్ పీఎస్ చౌరస్తా వరకు దాదాపు 40 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని లెక్క తేల్చారు.
దీంతో పాటు బాపూనగర్ బస్తీలోని ముస్లిమ్ బస్తీలో కూడా 6 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సమస్యను మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చిన కొద్ది గంటల వ్యవధిలో ప్రతిపాదనలు సిద్ధమైన తీరు ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని బాపూనగర్ బస్తీ అధ్యక్షులు హరిసింగ్జాదవ్ తెలిపారు.