అతడో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చిన్ననాటి నుంచి చదువుతోపాటు వ్యవసాయం అంటే మక్కువే.. అందుకే ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.. కల్వకుర్తి మండలం బెక్కెర గ్రామ యువ రైతు శ్రీధర్రెడ్డి. ఒకే పంటకు పరిమితమైన తన పొలంలో సేంద్రియ పద్ధతిలో మూడున్నర ఎకరాల్లో జామ తోట సాగు చేశాడు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల్లేకుండా అంతరపంటగా కూరగాయలు పండిస్తున్నాడు. మిగితా ఎకరాల్లో వేరుశనగ సాగు చేసి దిగుబడుల్లో సిరులు పండిస్తున్నాడు. సమీకృత విధానంతో తక్కువ వ్యయంతో అధిక ఆదాయం ఆర్జిస్తున్నాడు.
కల్వకుర్తి రూరల్, జనవరి 21 : అతడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు వ్యవసాయంపై ఆసక్తిని పెంపొందించుకున్నాడు. కష్టపడి ఉన్నత చదువులు చదివినా వ్యవసాయాన్ని మాత్రం వదలలేదు. బెంగళూరులో ఉద్యోగం చేస్తూనే ప్రతి శని, ఆదివారాలు సహ ఉద్యోగులతో కలిసి పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి సాగు విధానాలను తెలసుకున్నాడు. లాక్డౌన్లో స్వగ్రామానికి చేరుకుని ఇంటి వద్ద నుంచే ఆఫీస్ పనులు చేసుకుంటూ పొలంలో సేంద్రియ వ్యవసాయం చేయాలని సంకల్పించాడు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త పాలేకర్ వ్యవసాయ విధానాలకు ఆకర్షితుడై పైసా ఖర్చు లేకుండా సహజ సిద్ధంగా దొరికే వాటితో వ్యవసాయాన్ని పండగలా చేయొచ్చని నిరూపిస్తున్నాడు. అతడే యువరైతు వడ్లపల్లి శ్రీధర్రెడ్డి.
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం బెక్కర గ్రామానికి చెందిన పర్వత్రెడ్డి, సుగుణమ్మ దంపతుల కుమారుడు శ్రీధర్రెడ్డి. ఒక పంటకు పరిమితమైన పొలాన్ని తన మేథాశక్తితో సేంద్రియ విధానాలను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ముందుగా జామ తోటను సాగు చేసి సఫలీకృతమయ్యాడు. నీటి వసతి పుష్కలంగా ఉండడంతో సేంద్రియ విధానంలో వేరుశనగ కూడా చేయాలని సంకల్పించాడు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండా తన పొలంలో తయారుచేసిన గో ఆధారిత వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తక్కువ వ్యయంతో అధిక ఆదాయం ఆర్జించే దిశగా అడుగులు వేస్తున్నాడు.
వ్యవసాయమంటే పండగ..
చాలా మంది రైతులు కృత్రిమ ఎరువులు, క్రిమి సంహారక మందులను కొనుగోలు చేసి డబ్బులు పాడుచేసుకుంటున్నారు. వ్యవసాయాన్ని దండగ చేస్తున్నారు. గో ఆధారిత వ్యవసాయం విధానం చాలా గొప్పది. ఎలాంటి ఖర్చు లేకుండా అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. మన ప్రాంత రైతులు సేంద్రియ వ్యవసాయ విధానంపై అవగాహన పెంచుకోవాలి. ఈ విధానంతో దిగుబడి అధికంగా వస్తుంది. వ్యవసాయం పండుగలా మారుతుంది. పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదు. గతంలో మా పొలం చాలా వరకు బీడుగా ఉండేది. ఇప్పుడు అంతా సాగులోకి వచ్చింది. జామ తోటను, వేరుశనగ పంటను చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
మూడున్నర ఎకరాల్లో జామ..
రెండేండ్ల కిందటి వరకు శ్రీధర్రెడ్డి పొలం సాధారణంగా ఉండేది. ఇప్పుడా పొలంలో రూ.లక్షలు ఆర్జిస్తున్నాడు. లాక్డౌన్లో గ్రామానికి చేరుకొని ఇంటి వద్ద నుంచే ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే తనకున్న 16 ఎకరాల్లో ముందుగా మూడున్నర ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో జామ సాగు చేశాడు. పొలం అంచుల వెంట శ్రీగని, మహాగని, టేకు, మలబార్, కర్జూర వంటి మొక్కలను రూ.2 లక్షల వ్యయంతో నాటి డ్రిప్ విధానంలో నీటిని అందిస్తున్నాడు. తోటసాగు చేసిన తొమ్మిది నెలల తర్వాత పంట చేతికి వచ్చింది. ఒక్కో కాయ దాదాపుగా 800 గ్రాముల నుంచి కిలో వరకు తూకం వచ్చింది. మొదటిసారి రూ.60 నుంచి రూ.70 వేల వరకు ఆదాయాన్ని సంపాదించాడు. ఏడేండ్లపాటు పంట పండుతుంది. కాతను బట్టి వారం, పది రోజులకోసారి పండ్లను తెంచి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు రైతు తెలిపాడు. ఏడేండ్ల వ్యవధిలో రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నాడు. పూర్తిగా సహజ సిద్ధమైన ఎరువులను వినియోగించడంతో కాత ఏపుగా వస్తుందని అంటున్నాడు. జామ తోటలో కలుపు తీసేందుకు, దున్నేందుకు నానో ఎలక్ట్రికల్ ట్రాక్టర్, పురుగుల బెడద నివారణకు సోలార్ ట్రాప్స్, డ్రిప్ విధానాన్ని వినియోగించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధిస్తున్నాడు. ఖాళీ సాళ్లల్లో పూల మొక్కలు, ఇరవై రకాల పండ్ల మొక్కలు పెంచుతున్నాడు.
పదకొండు ఎకరాల్లో వేరుశనగ..
బీడుభూమిని పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు శ్రీధర్రెడ్డి పూనుకున్నాడు. 11 ఎకరాల్లో అనంతపురం జిల్లా కదిరి విశ్వవిద్యాలయం నుంచి తెచ్చిన వేరుశనగ, మరె రకం కే6, మరో ఎకరాలో సేంద్రియ పద్ధతిలో వరి సాగు చేస్తున్నాడు. మండలంలో వేరుశనగ పంటకు లద్దె పురుగు బెదడ ఉండగా.. శ్రీధర్రెడ్డి పొలం మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. వేరుశనగ విత్తనాలు విత్తిన వారం, పది రోజులకు పొలంలో తయారు చేసిన సేంద్రియ ఎరువులు,క్రిమి సంహారక మందులను పిచికారీ చేశాడు. దీంతో పంటను ఎలాంటి పురుగు ఆశించలేదు. అధిక దిగుబడి రావడంతో సమీప రైతులు శ్రీధర్రెడ్డి పొలాన్ని సందర్శిస్తున్నారు. సాగు విధానం, సేంద్రియ ఎరువుల తయారీ, వ్యవసాయ విధానాలను తెలుసుకుంటున్నారు. తమ పొలంలో కూడా ఇలాంటి విధానాలు ఎలా అవలంబించాలనే విషయాలపై అవగాహన పెంచుకుంటున్నారు. డ్రిప్ విధానం, సాగు ఖర్చును వివరిస్తున్నాడు.