ఆ ఊరంతా పాల ఉత్పత్తే.. చాలామంది రైతులకే ఇదే ప్రధాన జీవనాధారం.. ప్రతి ఇంటికి కనీసం నాలుగైదు ఆవులు, గేదెలను పోషించుకుంటున్నారు.. రోజుకు 6వేల లీటర్లకు పైగా పాల ఉత్పత్తి చేస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు షాబాద్ మండలంలోని కుమ్మరిగూడవాసులు. పాల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ఈ గ్రామం రెండోస్థానంలో నిలిచింది. గ్రామంలో 700లకు పైగా కుటుంబాలుంటే .. 500 కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థ విజయ డెయిరీతోపాటు, మరో ఐదు ప్రైవేట్ డెయిరీలు పాలు సేకరిస్తున్నాయి. ఇక్కడి పాడి పరిశ్రమ అభివృద్ధిని తెలుసుకున్న వివిధ రాష్ర్టాలకు చెందిన బృందాలు గతంలో గ్రామాన్ని సందర్శించి పాల ఉత్పత్తికి రైతులు అవలంబి స్తున్న పద్ధతులను అడిగి తెలుసుకుని కితాబునిచ్చాయి.
-షాబాద్, సెప్టెంబర్ 11
పాడిని నమ్ముకుంటే మంచి ఆదాయం వస్తుందని పూర్తి విశ్వాసం కలిగిన ఆ గ్రామ రైతులు, యువకులు ఆవులు, గేదెలను పోషించుకుని జీవనం సాగిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఆ గ్రామంలో యువకులంతా ఉన్నత చదువులు చదివి స్వశక్తిని నమ్ముకుని పాడి పరిశ్రమపై దృష్టి సారించారు. క్షీరధారతో లాభాలు గడిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతి ఇంటికి సుమారు 4 నుంచి 8 పాడి ఆవులు, గేదెలున్నాయి. రోజుకు ఒక్కో రైతు 30-60 లీటర్ల పాల ఉత్పత్తి చేపడుతూ ఆదాయాన్ని పొందుతున్నారు. పాడి పరిశ్రమలో
ఆదర్శంగా నిలిచిన కుమ్మరిగూడ గ్రామంపై ప్రత్యేక కథనం..
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుమ్మరిగూడ గ్రామంలో సుమారు 2వేల వరకు జనాభా ఉన్నారు. ఇందులో 700లకు పైగా కుటుంబాలుంటాయి. వీరిలో 500 కుటుంబాలు పాడి పరిశ్రమపై జీవనం సాగిస్తున్నారు. ఎక్కువ మంది రైతులకు బోరుబావుల కింద నీటి సౌకర్యం ఉండడం, స్థానికంగా వివిధ కంపెనీల పాలశీతలీకరణ కేంద్రాలు ఉండడం మరింత కలిసొచ్చింది. ప్రతి కుటుంబంలో 4 నుంచి 8 వరకు పాడి ఆవులు, గేదెలను పోషిస్తూ పాల దిగుబడిని పెంచుతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, పొంగనూర్, హర్యానా, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి సుమారు రూ.80వేల నుంచి రూ. 1.20లక్షల వరకు వెచ్చించి రైతులు పాడి ఆవులు, గేదెలను కొనుగోలు చేస్తున్నారు. కేవలం ఒక్క కుమ్మరిగూడ గ్రామంలోనే ప్రతి రోజూ 6వేల లీటర్ల వరకు పాల ఉత్పత్తి చేసి షాబాద్తోపాటు షాద్నగర్, చేవెళ్ల, పరిగి, హైదరాబాద్, నందిగామ తదితర ప్రాంతాల్లోని పాలశీతలీకరణ కేంద్రాలకు పాలు తరలిస్తున్నారు.
ఉపాధికి రాచబాటగా పాడి పరిశ్రమ
ఈ గ్రామానికి చెందిన చాలామంది రైతులు వ్యవసాయం, కూలీ పనులు చేయడం కంటే పాడి పరిశ్రమలో అధిక లాభాలున్నాయని భావించి పాడి పరిశ్రమ వైపు దృష్టి సారించారు. రోజుకు ఒక్కో రైతు 30-60 లీటర్ల వరకు పాలు పోస్తున్నారు. కుమ్మరిగూడలో ప్రభుత్వ విజయ డెయిరీతో పాటు, హెరిటేజ్, మస్కతి, జెర్సీ, సిడ్ఫామ్, తిరుమల డెయిరీలున్నాయి. ఆవు పాలకు రూ.30-35 వరకు, గేదె పాలకు రూ.50-60 వరకు చెల్లిస్తున్నారు. ఇతర పనులకు వెళ్లి పొద్దంతా కష్టపడే బదులు పాడి పరిశ్రమలో ఉదయం గంట, సాయంత్రం గంట కష్టపడితే మంచి ఆదాయం వస్తుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో పలు రాష్ర్టాల బృందాలు పర్యటన
షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామం పాల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. గతంలో ఈ గ్రామాన్ని వివిధ రాష్ర్టాల బృందాలు సందర్శించాయి. రైతులు పాల ఉత్పత్తిలో ఏ విధంగా ముందుకు సాగుతున్నారో.. పశుగ్రాసాన్ని ఎలా పెంచుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ పాటించే పద్ధతులు తమ రాష్ర్టాల్లో పాటించి పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటామని పేర్కొన్నారు.
పాల ఉత్పత్తితో మంచి లాభాలు : పి.దినేశ్, యువ రైతు, కుమ్మరిగూడ
పాల ఉత్పత్తితో మంచి లాభాలున్నాయి. మా వద్ద పది వరకు పాడి ఆవులున్నాయి. రోజుకు 40-50 లీటర్ల వరకు పాలు పోస్తున్నాను. డిగ్రీ వరకు చదువుకున్నాను. పై చదువులు చదువడం ఇష్టంలేక పాడి పరిశ్రమ వైపు దృష్టి సారించాను. ఇతర పనుల కన్నా పాడి పరిశ్రమలో శ్రమ తక్కువ, ఆదాయం ఎక్కువ ఉంది.
రోజుకు 2వేల లీటర్లు సేకరిస్తాను