తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో గ్రామాలు ప్రగతి వైపు పరుగులు తీస్తున్నాయి. అభివృద్ధితో పాటు పారిశుధ్యంలోనూ మేటిగా నిలుస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 1,124 పంచాయతీల్లో ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలించి వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. ఈ ఎరువును గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలకు వినియోగించగా, మిగిలిన దానిని రైతులకు విక్రయిస్తున్నారు. వచ్చిన డబ్బులను జీపీ ఖాతాల్లో జమ చేసి గ్రామాలాభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. దీంతో పంచాయతీలకు డంపింగ్ యార్డులు ఆదాయ వనరుగా మారాయి. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ఫలాలిస్తుండడం గమనార్హం.
షాబాద్, మే 15: గ్రామాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డిజిల్లాలో మొత్తం 558 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం డంపింగ్యార్డుల నిర్మాణం చేసింది. తడి చెత్తతో వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేసి నర్సరీల్లోని మొక్కలకు వినియోగిస్తున్నారు. పొడి చెత్తలో ప్లాస్టిక్ తదితర చెత్తను యార్డులో భద్రపరిచి విక్రయిస్తున్నారు. వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని జీపీ ఖాతాల్లో జమ చేసి గ్రామ అభివృద్ధికి వినియోగిస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో డంపింగ్యార్డుల ద్వారా వచ్చిన ఎరువును మొక్కలకు వాడుకోగా, మిగిలినది గ్రామంలోనే రైతులకు సైతం విక్రయిస్తున్నారు.
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లోని 558 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా డంపింగ్యార్డుల నిర్మాణం చేపట్టింది. ప్రతి రోజూ జీపీ సిబ్బంది గ్రామాల్లోని ప్రతి ఇంటి నుంచి ట్రాక్టర్ల ద్వారా తడి, పొడి చెత్తను సేకరించి వేర్వేరు చేస్తున్నారు.
తడి చెత్త ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేసి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లోని మొక్కలకు వినియోగిస్తున్నారు. పొడి చెత్తలోని ప్లాస్టిక్ తదితర చెత్తను డంపింగ్ యార్డుల వద్దనే ప్రత్యేకంగా భద్రపరిచి విక్రయిస్తున్నారు. చెత్త సేకరణ చేపట్టడంతో గ్రామాలన్నీ శుభ్రంగా మారుతున్నాయి. కాలనీల్లోని రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలతో గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతున్నది.
పల్లెప్రగతి ద్వారా ప్రతి గ్రామంలో తడి, పొడి చెత్తను సేకరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందుగానే ప్రజలకు తడి, పొడి చెత్తపై అధికారులు అవగాహన కల్పించారు. పంచాయతీ నుంచి రెండు చెత్త బుట్టలు కూడా పంపిణీ చేశారు. తడి పొడి చెత్తను వేర్వేరుగా చేసి తమ సిబ్బందికి అందించాలని సూచించారు. దీంతో పంచాయతీ సిబ్బంది చెత్త సేకరణ చేస్తున్నారు.
డంపింగ్యార్డులకు తరలించిన తర్వాత తడి చెత్తను వర్మీ కంపోస్టుగా తయారు చేస్తున్నారు. దీంతో హరితహారం నర్సరీల్లో మొక్కలకు చెత్త నుంచి తయారు చేసిన ఎరువును వాడుతున్నారు. అదే విధంగా పొడి చెత్తను విక్రయించడంతో కొంత డబ్బు వస్తున్నది. దీంతో జీపీలను బలోపేతం చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
తాండూరు, మే 15 : తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో గ్రామాల్లో నెలకొన్న అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి. సీఎం కేసీఆర్ పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నిధులు విడుదల చేస్తున్నారు. ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు బాధ్యతతో పల్లె ప్రగతిలో భాగస్వాములయ్యారు. ఒక్కో గ్రామానికి రూ.2.50 లక్షలతో కంపోస్ట్ షెడ్లను నిర్మాణం చేపట్టారు.
పంచాయతీ కార్మికులు ఇంటింటికీ సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి వర్మీకంపోస్టు ప్రక్రియ ద్వారా ఎరువును తయారు చేస్తున్నారు. ఈ ఎరువును హరితహారంలో నాటిన మొక్కలకు, పల్లె ప్రకృతి వనంలో ఉన్న మొక్కలకు ఎరువుగా వేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ఎరువు తయారు చేసి అమ్మకాలు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.
పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక నిధులతో జిల్లాలోని 566 పంచాయతీల్లో రూ.14.15 కోట్లతో డంపింగ్ యార్డు, కంపోస్టు షెడ్ల నిర్మాణం చేశారు. గ్రామాల్లో ఎక్కడా చెత్త కనిపించకుండా డంపింగ్ యార్డు, కంపోస్టు షెడ్లలో వేస్తున్నారు. దీంతో గ్రామాలన్నీ స్వచ్ఛతగా కనిపిస్తున్నాయి.
పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. చెత్త సేకరణ, నీటి సరఫరా కోసం ప్రతి పంచాయతికీ ప్రత్యేక వ్యక్తులను నియమించి వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి ఐదో విడుత పల్లె ప్రగతి ప్రారంభం కానుంది. అందుకు ఈ నెల 18న సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
పల్లె ప్రగతితో మా ఖాంజాపూర్ గ్రామం అందరి సహకారంతో శుభ్రత, పచ్చదనంగా కనిపిస్తున్నది. పంచాయతీలో తీర్మానం చేసి అభివృద్ధి పనులు చేస్తున్నాం. శిథిలావస్థలో ఉన్న గృహాలను తొలగించి, వార్డుల్లో ఎప్పటికప్పుడు శుభ్రతగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. తడి, పొడి చెత్తను కంపొస్టు షెడ్లో వేరుగా వేసి ఎరువుగా మారుస్తున్నాం. పల్లెల అభివృద్ధికి ప్రణాళికను రూపొందించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– లలిత, సర్పంచ్, ఖాంజాపూర్
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ ప్రణాళిక కార్యాచరణలో అందరూ పాల్గొంటున్నారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించడంతో మారుమూల వెనుక బడిన పల్లెలన్నీ పచ్చదనం, శుభ్రతతో కళకళలాడుతున్నాయి. ఇంటింటికీ తిరిగి సేకరించిన తడి, పొడి చెత్తను కంపోస్టు షెడ్, డంపింగ్యార్డుల్లో వేరుగా వేసి వర్మీకంపోస్టు ప్రక్రియ ద్వారా ఎరువును తయారు చేస్తున్నాం. దీనిని పల్లె ప్రకృతి వనంలోని మొక్కలు, చెట్లకు ఎరువుగా వేస్తున్నాం.
– పావని, పంచాయతీ కార్యదర్శి, దేవనూరు
పల్లెప్రగతి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 558 గ్రామ పంచాయతీల్లో డంపింగ్యార్డులను ఏర్పాటు చేశాం. పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ తడి, పొడి చెత్తను సేకరించి వేరు చేస్తున్నారు. తడి చెత్తను వర్మీకంపోస్టు ఎరువుగా మార్చి మొక్కల పెరుగుదలకు ఉపయోగిస్తున్నాం. కొన్ని గ్రామాల్లో మొక్కలకు వేయగా మిగిలిన ఎరువును గ్రామాల్లోనే విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని జీపీ ఖాతాల్లో జమ చేస్తున్నాం.
– శ్రీనివాస్రెడ్డి, రంగారెడ్డిజిల్లా పంచాయతీ అధికారి