వికారాబాద్, మార్చి 29, (నమస్తే తెలంగాణ): ఖరీఫ్ పంటల సాగుకు యాక్షన్ప్లాన్ సిద్ధమైంది. వికారాబాద్ జిల్లాలో 5.97 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసిన వ్యవసాయ శాఖ అందుకు అనుగుణంగా సిద్ధం అవుతున్నది. నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో పత్తి తర్వాత అత్యధికంగా వరి,ఇతర కూరగాయ పంటల సాగుకే మొగ్గుచూపుతున్నారు. ఖరీఫ్లో సన్నాలే అధికంగా సాగు చేయనున్నారు.అయితే వరి పంట సాగును సాధ్యమైనంత వరకు తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు. వరికి బదులు ఇతర ఆరుతడి పంటలు వేసుకోవాలంటున్నారు. దీంతో వ్యవసాయశాఖ సీజన్ కు ముందే ఎరువులు, విత్తనాలను సైతం సిద్ధంగా ఉంచేందుకు ప్రణాళిక రూపొందించింది.
5.97లక్షల ఎకరాల్లో పంటలు సాగు..
వికారాబాద్ జిల్లాలో వానకాలంలో 5.97లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుకానున్నాయని అధికారులు అంచనా వేశారు.అందులో వరి 75,491.39 వేల ఎకరాలు, పత్తి 2,73,963.21లక్షల ఎకరాల్లో సాగు కానుంది. అదే విధంగా కంది 1,85,104.08లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నారు. పెసర 24,382,మినుములు 10,897.09 వేల ఎకరాలు, 9742.15వేల ఎకరాల్లో జొన్న, 97.06 నువ్వులు, 2095.17వేల ఎకరాల్లో సోయాబీన్, 16645.43 ఎకరాల్లో మొక్కజొన్న, 3095.20 ఎకరాల్లో చెరుకు 536.24 ఎకరాల్లో వేరుశనగ,168 ఎకరాల్లో రాగి,ఇతర పప్పు ధాన్యాలు,ఇతర ఫుడ్క్రాప్స్ పంటల సాగు చేయనున్నారు. పప్పు దినుసుపంటలను మండలాల వారీగా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది.జిల్లాలో ప్రధానంగా వరి,పత్తి,జొన్న, పెసర,కంది పంట లే అధికంగా సాగు కానున్నాయి.వచ్చే వానకాలం సీజన్లో సన్నరకాలనే సాగు చేయాలనే నిర్ణయించారు. మే నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున గ్రామాల్లో నకిలీ విత్తనాలు విక్రయించకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులకే కలెక్టర్ అప్పగించారు.
దొడ్డు రకాలకు స్వస్తి..
వరి సన్నరకాలే సాగు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడం తో రానున్న రోజుల్లో దొడ్డురకాల సాగు ఉండకపోవచ్చు. బాయిల్డ్ రైస్ను తినేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పాటు వసతి గృహాలు మొదలు సంక్షేమ పథకాలకు సైతం సన్న బియ్యాన్నే ప్రభుత్వం సరఫరా చేస్తుండటంతో ఇకపై వరి సన్నరకాలే సాగు కానున్నాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 97 క్లస్టర్లు, నాలుగు డివిజన్లు ఉన్నాయి. ఇందులో2లక్షల24వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. 26వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు జిల్లాకు చేరాయి.వీటిని 50 శాతం రాయితీపై అందించనున్నారు. 5.97లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుకు గాను మొత్తానికి 1,03,109 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. 2లక్షల 24వేల 954 మంది రైతులకు గాను 2లక్షల 80వేల ఖాతాలున్నాయి.
ఇప్పటి వరకు 2లక్షల 9వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.294.85కోట్లు రైతుబంధు జమ అయ్యాయి.జిల్లాలో 51.5% నల్లరేగడి,27.2%ఎర్రమట్టి,17% లేటరైట్ భూములున్నాయి. జిల్లాలోని 16 మండలాల్లో పాస్ఫరస్ అధిక మోతాదులో నమోదైంది. 13 మండలాల్లో పొటాషి యం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. జిల్లా పరిధిలో పైలాట్ ప్రాజె క్టు కింద ప్రతి మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి మొత్తం 2400 నమూనాలు సేకరించి మట్టి పరీక్షలు నిర్వహించిన్నట్లు వ్యవసాయాధికారులు వెల్లడించారు.