ఇబ్రహీంపట్నంరూరల్/ షాద్నగర్టౌన్, అక్టోబర్ 20 : విధి నిర్వహణ కోసం పోలీసులు తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు. ప్రజాసేవ, దేశ రక్షణే కర్తవ్యంగా అసువులు బాసిన పోలీసు వీరులను స్మరించుకోవడం కనీసం మన బాధ్యత.. అమరులైన వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు పోలీసుశాఖ ప్రయత్నాలు చేస్తుంది. పౌరులుగా మనవంతు చేయూతనందించే ప్రయత్నం చేద్దాం. భారత, చైనా సరిహద్దు ప్రాంతాల్లోని లడక్లో ఆక్సాయ్చిన్ వద్ద 1959 అక్టోబర్21న కేంద్ర రిజర్వు పోలీసుదళం (సీఆర్పీఎఫ్) విధులు నిర్వహిస్తుండగా భారత భూభాగంలోనికి చైనా బలగాలు చొరబడినప్పుడే దేశ రక్షణే లక్ష్యంగా వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి పోరాడారు. ఆ పోరాటంలో వందమంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. చైనా బలగాల దురాక్రమణను తిప్పికొట్టే ప్రయత్నంలో తమ దేశం కోసం పోరాడి అసువులు బాసిన పోలీసువీరుల స్మరిస్తూ ప్రతి ఏటా పోలీసుశాఖ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినంగా పాటించాలని నిర్ణయించారు. నాటినుంచి నేటి వరకు ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుని వారి కుటుంబాలకు పోలీసుశాఖ సహాయ సహకారాలను అందిస్తూ, ప్రజాసేవకు పునరంకితమవుతుంది. సామాన్యుల నుంచి మొదలుకుని సంపన్నుల వరకు ఆపదల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ పోలీసులపైనే ఆధారపడుతున్నారు. నిరంతరం పని ఒత్తిడితో ఉన్నప్పటికీ, శాంతిభద్రతలను కాపాడే ఉద్దేశంతో రాజీలేని తనంతో ముందుకు సాగుతుంటారు. ప్రజాసేవను పరామవదిగా భావించి ఎంతోమంది పోలీసు సిబ్బంది అసువులు బాసారు. అటువంటి వారిలో ఐపీఎస్ అధికారులు పరదేశీనాయకుడు, వ్యాస్, ఉమేశ్చంద్ర, కృష్ణప్రసాద్ వంటి వారు ఉన్నారు. పోలీసు అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోలీసు వీరుల దినం సందర్భంగా వారికి ఘన నివాళులర్పిద్దాం.
శాంతి భద్రతల పరిరక్షణ..
దేశంలో అంతర్గత శాంతి భద్రతల పరిరక్షణ ఎంతో ముఖ్యమైంది. దేశంలో అనేక మతాలు, కులాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు ఉన్నందున వారంతా కలిసిమెలిసి శాంతియుతంగా జీవించేలా చూడటం పోలీసుల ధర్మం. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ జీవనతత్వం ఉగ్రవాదం, తీవ్రవాదం, కులఘర్షణలు, మతతత్వ శక్తులు, అసాంఘిక శక్తులు, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి సామాజిక జాడ్యాలు ప్రజల జీవితాన్ని ఆశాంతిపాలు చేస్తున్నాయి. దేశంలో అంతర్గత శాంతిని హరించివేస్తూ కర్వ్యూలు, 144సెక్షన్లు, బంద్లు కొనసాగుతూ ఉంటే ఏ దేశమైనా ఎలా అభివృద్ధి చెందుతుంది? ఈ అంతర్గత శాంతిని అంతమొందించే ప్రయత్నంలో పోలీసులు మహోన్నత త్యాగాలు చేస్తున్నారు. అమూల్యమైన తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజిస్తున్నారు. త్యాగాల సంస్కృతికి పునర్జీవం కలిగిస్తున్నారు.
అమరులైన పోలీసులు
రంగారెడ్డి జిల్లా పరిధిలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఆధిపత్యం పోరులో నలుగురు పోలీసులు మృతిచెందారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయక నలుగురు పోలీసులు మరణించారు. పోలీసుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఓపెన్ హౌజ్లు, రక్తదాన శిబిరాలు, స్మారక క్రీడలు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు కుటుంబాలకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో సహాయ సహకారాలు అందజేస్తున్నారు.
యాచారం పోలీస్స్టేషన్లో పేల్చివేత
1997 మార్చి 31న యాచారం పోలీస్స్టేషన్పై మావోయిస్టులు దాడిచేశారు. అప్పటి ఎస్సై మనోహర్రావు విధులు నిర్వహించి, ఇంటికి వెళ్లిన అనంతరం స్టేషన్పై మావోయిస్టులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించి, మందు పాతర అమర్చి పోలీస్స్టేషన్ను పేల్చివేశారు. ఆ సమయంలో కానిస్టేబుళ్లు రాజేశ్వర్రావు, జమీర్అహ్మద్లు దుర్మరణం పాలయ్యారు.
జన్మభూమి కార్యక్రమానికి వెళ్లి, తిరిగి వస్తూ..
2001లో మంచాల పోలీస్స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న సైదయ్య, కానిస్టేబుల్ సాయిలు మంచాల మండల పరిధిలోని బండాలేమూర్ గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి వెళ్లి, తిరిగి వస్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చి మట్టుబెట్టారు. ఈ మందుపాతర పేలుడులో ఎస్సై, కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యారు.
పోలీసు అమరవీరులు..
పోలీస్ విధి నిర్వహణ ఎంతో శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగాల్లో కొన్ని గంటలు మాత్రమే విధులు నిర్వహించి మిగతా సమయంలో ఆనందంగా ఉంటారు. పోలీసులు 24గంటలు ఆన్డ్యూటీలో ఉండి ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను పరిరక్షిస్తారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించటమే ఎంతో కష్టం. ప్రజలు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే. ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడుతూ ప్రజల పాలిట సింహ స్వప్నాలుగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాలనలో పోలీసులదే ప్రథమ పాత్ర… ప్రజల రక్షణ కోసం ప్రాణాలనే అర్పిస్తున్నారు. అనేక సేవలతో అనునిత్యం ప్రజలకు అప్రమత్రులుగా నిస్వార్థ సేవలందిస్తూ తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు పోలీసులు.
ఫ్రెండ్లీ పోలీసులతో ప్రజలకు మరింత చేరువ
ప్రభుత్వం ఏర్పడ్డాక పోలీసుల పనితీరులో విభన్నమైన మార్పు వచ్చింది. తెలంగాణ సర్కార్ తీసుకున్న ఫ్రెండ్లీ పోలీస్ నిర్ణయంతో ప్రజలతో పోలీసులు కలిసిపోతూ వారిలో ఒకరయ్యారు. ఎక్కడ అన్యాయం జరిగినా నేడు సామాన్య ప్రజలు సైతం పోలీసులకు సమాచారం అందిస్తూ నేరాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అదే విధంగా మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేయడంతో మహిళలు ధైర్యంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళలకు పోలీసులు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తుడడంతో మహిళల్లో పోలీసులపై మరింత నమ్మకం ఏర్పడింది.
ప్రజా రక్షణే ధ్యేయం
ప్రజా రక్షణ కోసం పోలీసులు 24గంటలు విధులు నిర్వహిస్తారు. ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసుల సేవలను ప్రజలు గుర్తించాలి. శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల ప్రథమ కర్తవ్యం. విధి నిర్వహణలో తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన పోలీసులకు జోహర్లు. వారి త్యాగాలు చిరస్మరణీయం.
ప్రజలు సహకరించాలి
ప్రజల్లో నేరాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. అదే విధంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో కలిగే లాభాలను ప్రజలకు వివరించాం. ప్రజలు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలి.
-నవీన్కుమార్ సీఐ షాద్నగర్