ఇబ్రహీంపట్నంరూరల్, సెప్టెంబర్ 18 : రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి పథకం ద్వారా సీఎం కేసీఆర్ పెద్దన్నలా అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం మండలంలోని 14 పంచాయతీలకు చెందిన 66మంది లబ్ధిదారులకు మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆడబిడ్డల పెండ్లి ఆర్భాటంగా చేసి అప్పుల పాలవుతున్నారన్నారు. నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి డబ్బులు లబ్ధిదారులకు ఆలస్యం చేయకుండా అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ పెండ్లి జరిగిన ఆరునెలల లోపు చెక్కులు అందించే విధంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. డబ్బులను వృధా చేయకుండా పెండ్లి కోసం చేసిన అప్పులు తీర్చుకోవాలన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే భారీగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసినట్లు తెలిపారు.
యువతకు అండగా ఎంకేఆర్ ఫౌండేషన్..
ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా రెండు విడుతల్లో పోలీసు కానిస్టేబుల్ శిక్షణ పొందిన యువత ఉద్యోగాలు సాధించారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, వైస్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో మహేశ్బాబు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.