కొత్తగా ఓటరు నమోదుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరో చాన్స్ ఇచ్చింది. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఆన్లైన్ (గరుడ యాప్), ఆఫ్లైన్లోనూ ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకునేందుకు గడువిచ్చింది. మార్పులు, చేర్పులతో పాటు కొత్త ఓటరు నమోదుకు ఆన్లైన్తో పాటు నేరుగా మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలోగాని, బూత్స్థాయి అధికారులకుగాని దరఖాస్తులను అందజేయవచ్చు. వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 20వ తేదీ వరకు అధికారులు పరిశీలించనున్నారు. పూర్తిస్థాయి దరఖాస్తుల పరిశీలన తర్వాత జనవరి 5వ తేదీన తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనున్నది. ఓటరు ముసాయిదా జాబితా ప్రకారం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 31,49,800 మంది ఓటర్లు ఉండగా, వికారాబాద్ జిల్లాలో మొత్తం 9,01,623 ఓటర్లు ఉన్నారు.
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, నవంబర్ 16 : ఓటరుగా నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పించింది. 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండినవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఓటరు జాబితాలో తప్పొప్పులను సవరించేందుకు అనుమతినిచ్చింది. ఈ నెల 1న ఆయా జిల్లాల కలెక్టర్లు ఓటరు ముసాయిదా జాబితాలను విడుదల చేశారు. జనవరి 5న తుది జాబితా విడుదల కానుంది. రంగారెడ్డి జిల్లాలో 31,49,809, వికారాబాద్ జిల్లాలో 9,01,623 ఓటర్లు ఉన్నారు. కొత్తగా నమోదు, మార్పులకు అవకాశం కల్పించడం ద్వారా ఓటర్ల సంఖ్యలో మార్పులు రానున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో 31,49,800 మంది ఓటర్లు
జిల్లావ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 31,49,800 మంది ఓటర్లు, వీరితోపాటు 377 మంది ట్రాన్స్జెండర్లు, ఎన్ఆర్ఐలు, ఇతర ఓటర్లు కలిపి మరో 768 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 3307 పోలింగ్ కేంద్రాలుండగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 316, ఎల్బీనగర్లో 545, మహేశ్వరంలో 511, రాజేంద్రనగర్లో 535, శేరిలింగంపల్లిలో 590, చేవెళ్లలో 298, కల్వకుర్తిలో 262, షాద్నగర్ నియోజకవర్గంలో 250 పోలింగ్ కేంద్రాలున్నాయి.
వికారాబాద్ జిల్లాలో 9,01,623 మంది ఓటర్లు
వికారాబాద్ జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు 9,01,623 మంది కాగా.. వారిలో పురుషులు 4,51,134, మహిళలు 4,49,945, ఇతరులు 544 మంది ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి జిల్లాలో 4,300 మంది ఓటర్లు పెరిగారు.
దరఖాస్తు చేసుకునేదిలా..
ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించగా, గరుడ యాప్ ద్వారా ఎక్కడికక్కడే నమోదు కొనసాగుతున్నది. కొత్త ఓటర్ల నమోదు, ఏవైనా అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తులుంటే వెంటనే పరిష్కరించేందుకు గరుడ యాప్ ఎంతో దోహదం చేస్తుంది. నూతన ఓటర్లు మీ-సేవ, ఇంటర్నెట్లతో పాటు స్మార్ట్ఫోన్ల ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ కోసం ఫారం-6, అసెంబ్లీ నియోజకవర్గంలో చిరునామా మారిన సమయంలో ఫారం-8ఏ, సవరణకు ఫారం-8, ఓటరు జాబితాలో పేరు తొలగింపునకు ఫారం-7లో నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాలను ఆయా నియోజకవర్గాల్లో అందజేస్తున్నారు. మార్పులు, చేర్పులకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది. డిసెంబర్ 20 వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు. జనవరి 5న తుది జాబితాను ప్రకటిస్తారు. కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించడంతో జిల్లావ్యాప్తంగా ఓటర్ల సంఖ్య భారీగానే పెరుగనుంది.
గరుడ యాప్తో తక్షణమే..
ఎన్నికల కమిషన్ తీసుకువచ్చిన గరుడ యాప్తో తక్షణమే ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు, మార్పులు జరుగుతున్నాయి. బూత్ లెవల్ ఆఫీసర్లు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొందరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటుండగా, మరికొంత మంది ఆఫ్లైన్లో నేరుగా కలిసి బూత్ లెవల్ ఆఫీసర్లకు దరఖాస్తు అందజేస్తున్నారు. ఆన్లైన్లో ceotelangana.in, http://nvsp.in ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారానికి పదో తరగతి మార్కుల మెమోతో పాటు అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరి. దరఖాస్తు సైతం నింపడానికి రానివారికి ఆఫీసర్లు వారి నిర్ధారణ పత్రాల ఆధారంగా యాప్లో నమోదు చేస్తున్నారు. ప్రతి బూత్ లెవల్ ఆఫీసర్కు గరుడ యాప్ యాక్సెస్ ఇచ్చి, ఆయా బూత్ల వారీగా పాస్వర్డ్ కేటాయించారు. ఆఫ్లైన్లో, ఆన్లైన్లో ఏ దరఖాస్తు వచ్చినా సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ పరిశీలించి పరిష్కరిస్తారు.