బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. ఇందుకుగాను రూ.928.41 కోట్ల నిధులను కేటాయించనున్నారు. రోడ్డు విస్తరణకు సంబంధించి 350 ఎకరాల భూమిని సేకరించనున్నారు. బీజాపూర్ రహదారిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న దృష్ట్యా ఆరు భారీ అండర్పాస్ బ్రిడ్జిలను, ఎనిమిది ప్రాంతాల్లో చిన్న అండర్పాస్ బ్రిడ్జిలనూ నిర్మించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. మొయినాబాద్ వద్ద 4.35 కి.మీ, చేవెళ్ల వద్ద 6.36 కి.మీ బైపాస్ రోడ్లను నిర్మించడంతో పాటు రహదారిని విస్తరిస్తున్న దృష్ట్యా అంగడిచిట్టంపల్లి వద్ద 12 లేన్ల టోల్ప్లాజాను నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. పలుమార్లు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రహదారి విస్తరణపై పార్లమెంట్లో ప్రస్తావించగా, నేటికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
రంగారెడ్డి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు బుధవారం ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. బీజాపూర్ జాతీయ రహదారి వెళ్లే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్లుగా రహదారిని నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతో ఒకట్రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియను చేపట్టేందుకు జాతీయ రహదారుల శాఖ సమయాత్తమవుతుంది. ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉండడంతోపాటు చేవెళ్ల ఎంపీ జి.రంజిత్రెడ్డి నాలుగు లేన్ల రహదారిగా విస్తరణకు సంబంధించి పలుమార్లు పార్లమెంట్లో ప్రస్తావించడంతో ఎట్టకేలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించి భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు. గత మూడేండ్లుగా బీజాపూర్ జాతీయ రహదారిపై అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ల, మన్నెగూడ, పరిగి, కర్నాటకలోని బీజాపూర్ వరకు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వారాంతపు సెలవుల్లో అయితే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు అధిక ట్రాఫిక్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా రహదారి చిన్నగా ఉండడం, వాహనాలు పెరుగడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్లకు ట్రాఫిక్ సమస్య కూడా ఎదురవుతున్నది. ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని నాలుగు లేన్ల రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకుగాను ఆమోదం లభించింది.
రూ.928.41 కోట్లతో రహదారి విస్తరణ
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలోనే షురూ కానున్నాయి. రూ.928.41 కోట్లతో నాలుగు లేన్ల రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. తొలుత రూ.800 కోట్లతో రహదారి విస్తరణ పనులకు సంబంధించి అంచనాలను రూపొందించినప్పటికీ, తాజా అంచనాల ప్రకారం మరో రూ.128 కోట్లకు పెంచారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర బీజాపూర్ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ పనులకుగాను 350 ఎకరాల మేర భూములను సేకరించనున్నారు.
ఎక్స్ప్రెస్ వే తరహాలో బీజాపూర్ జాతీయ రహదారి
ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల మాదిరిగా కాకుండా ఎక్స్ప్రెస్ వే తరహాలో ఈ రహదారి అందుబాటులోకి రానుంది. అప్పా నుంచి బీజాపూర్ రహదారి ప్రస్తు తం కొన్నిచోట్ల 25 మీటర్లు, మరికొన్నిచోట్ల 30 మీటర్లుగా ఉంది. రోడ్డు విస్తరణలో భాగంగా 60 మీటర్ల మేర రహదారి విస్తరించి నాలుగు లేన్లుగా మార్చనున్నారు. మన్నెగూడ నుంచి పరిగి, కొడంగల్, బీజాపూర్ వరకు 45 మీటర్ల మేర మూడు లేన్ల రహదారిగా ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు వెళ్లే జాతీయ రహదారి మధ్య ఉన్న గ్రామాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా జాతీయ రహదారిపైకి రాకుండా అండర్పాస్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. 46 కి.మీ పరిధిలో 6 భారీ అండర్పాస్ బ్రిడ్జిలను, ఎనిమిది ప్రాంతాల్లో చిన్న అండర్పాస్ బ్రిడ్జిలను నిర్మించి అందుబాటులోకి తీసుకురానున్నారు. బైపాస్ రోడ్లనూ నిర్మించేందుకు ప్లాన్ చేశారు. మొయినాబాద్ వద్ద 4.35 కి.మీ మేర, చేవెళ్ల వద్ద 6.36 కి.మీ మేర బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. నాలుగు లేన్ల రహదారిగా విస్తరిస్తున్న దృష్ట్యా అంగడిచిట్టంపల్లి వద్ద 12 లేన్ల టోల్ప్లాజా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
ఎన్నో ఏండ్ల కల సాకారం కాబోతున్నందుకు
సంతోషంగా ఉంది : చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు బీజాపూర్ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలుపడం చాలా సంతోషం. ఎన్నో ఏండ్లగా ఎదురుచూస్తున్న కల సాకారం కాబోతున్నది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఎప్పటికప్పుడు నాలుగు లేన్ల రహదారి విస్తరణ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడంతోపాటు సంబంధిత మంత్రి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లాను. నన్ను గెలిపించిన ప్రజలకు నేను ఇచ్చిన హామీని నెరవేర్చిన తృప్తి కలిగింది. విస్తరణ పనులు పూర్తైతే రోడ్డు ప్రమాదాలు తగ్గడంతోపాటు పారిశ్రామిక ప్రగతితోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగనుంది.
రహదారి నిర్మాణం చేయడం సంతోషకరం
రోడ్డు నిర్మాణం చేపట్టడం శుభపరిణామం : రాజు, చేవెళ్ల
నాలుగు లేన్ల రహదారి ఏర్పాటుకు కేంద్రం నుంచి ప్రతిపాదన తీసుకురావడం శుభ పరిణామం. చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైంది. ఎన్నో ఏండ్లేగా ఇబ్బందిగా మారిన రోడ్డు సమస్య పరిష్కారానికి ప్రకటన రావడం సంతోషకరం.
ఎంపీ రంజిత్రెడ్డికి రుణపడి ఉంటాం