ఆహ్లాదకర వాతావరణంలో మంచాల పోలీస్స్టేషన్
మొక్కల పెంపకంపై పోలీసుల ప్రత్యేక దృష్టి
రెండేండ్లలో వెయ్యికి పైగా నాటిన హరితహారం మొక్కలు
మంచాల, ఏప్రిల్ 4 : ఖాకీ బూట్ల చప్పుళ్లు.. లాఠీ శబ్ధాలతో కరుకుగా ఉండాల్సిన పోలీస్స్టేషన్ పచ్చని అందాలు పర్చుకుని ఆహ్లాదకర వాతావరణానికి నిలయంగా మారింది. వివిధ గ్రామాల నుంచి వచ్చే బాధితులకు పచ్చని చెట్లు సేద తీరుస్తున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు నేడు చెట్లుగా మారి మంచాల పోలీస్స్టేషన్ను ఖాకీ వనంలా మార్చేశాయి.
రెండేండ్లలో వెయ్యికి పైగా మొక్కలు..
మంచాల పోలీస్స్టేషన్లో రెండేండ్ల కాలంలో వెయ్యికి పైగా మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణను పోలీస్ సిబ్బంది చాలెంజ్గా తీసుకుని సంరక్షించారు. మండల కేంద్రంలో మూడెకరాల విస్తీర్ణంలో పోలీస్స్టేషన్ ఉంది. నివాసయోగ్యంగా క్వార్టర్లు కూడా నిర్మించారు. 2017 జులై 12న అప్పటి తెలంగాణ డీజీపీ అనురాగ్శర్మ ముఖ్య అతిథిగా వచ్చి మూడో దశ హరితహారంలో భాగంగా పోలీస్టేషన్ ఆవరణలో మెక్కలు నాటారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, ఇతర ఐపీఎస్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు తమ పేర్లపై మొక్కలు నాటారు. నాటిన మొక్క వద్ద అధికారులు ప్రజాప్రతినిథుల పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవడంతో మంచాల పోలీస్స్టేషన్ నేడు పచ్చని చెట్లతో అందంగా కనువిందు చేస్తున్నది. హరితహారంలో భాగంగా మొక్కలు పెంచే బాధ్యత తమదేనంటూ పోలీస్స్టేషన్ చుట్టూ సుమారు రెండు వేలకు పైగా పూలు, జామ, మామిడి, ఉసిరి, బాదం, రావి, వేప, చింత, కానుగ చెట్లను పోలీసు సిబ్బంది నాటి, వాటిని సంరక్షించారు. దీంతో స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులు చెట్ల నీడలో సేదదీరుతున్నారు.
మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి
పోలీస్స్టేషన్లో మొక్కల పెంపకంపై సీఐ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి శనివారం మొక్కలను సంరక్షించుకోవడానికి సిబ్బందితో కలిసి శ్రమదానం చేస్తున్నారు. ప్రతి మొక్కకూ రెండు రోజులకు ఒకసారి నీటిని అందిస్తున్నారు. మొక్కల మధ్య కలుపు తీస్తూ, నెల రోజులకు ఒకసారి ట్రాక్టర్ల సహాయంతో దున్నించి చదును చేస్తున్నారు.
ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలి
మొక్కలు నాటడమే కాకుండా సంరక్షించే బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన హరితహారం వాతావరణ సమతుల్యతను కాపాడుతుంది. తమవంతు బాధ్యతగా పోలీసులు కూడా మొక్కలు నాటుతున్నారు. మొక్కల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే నేడు ఆకుపచ్చని వనంలా పోలీస్ స్టేషన్ మారింది. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి.