ఉద్యోగి యోజనపై ప్రచారం
డివిజన్ల వారీగా సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు
కార్పొరేషన్, ఏప్రిల్ 10: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సఫాయిమిత్ర సురక్షా చాలెంజ్పై నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఇప్పటికే మానవ వ్యర్థాలను యంత్రాల ద్వారా తొలగించే దిశగా చర్యలు తీసుకున్న బల్దియా అధికారులు ఈ కార్యక్రమంపై ప్రజలకు విస్తృత ప్రచారం చేసేందుకు డివిజన్ల వారీగా సదస్సుల నిర్వహణపై దృష్టిసారిస్తున్నారు. భూగర్భ డ్రైనేజీలోని మ్యాన్హోల్స్ను శుభ్రం చేసేందుకు వీలుగా జెట్టింగ్ యంత్రాన్ని కొనుగోలు చేసి వినియోగిస్తుండగా.. మురుగు కాలువల్లోని సిల్ట్ను తొలగించేందుకు డీసీల్టెంగ్ యంత్రాన్ని వినియోగిస్తున్నారు. గతంలో నగరంలో పెద్ద సంఖ్యలో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు ఉండేవి. కాగా, ఈ చాలెంజ్లో భాగంగా నగరంలోని సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాల యజమానులతో మాట్లాడిన నగరపాలక సంస్థ అధికారులు పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ఫ్రీ నంబర్ 14420 ఏర్పాటు చేశారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు డివిజన్ల వారీగా సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ప్రారంభించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
సఫాయిమిత్ర ఉద్యోగి యోజనపై ప్రచారం
కేంద్ర ప్రభుత్వం నేషనల్ సఫాయిమిత్ర కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్కేఎఫ్డీసీ) కింద సఫాయి కార్మికులు, వారి గ్రూపుల కింద వివిధ మానవ వ్యర్థాలను తొలగించే యంత్రాల కొనుగోలుకు రుణ సదుపాయం కల్పిస్తున్నది. ఈ పథకంలో రూ. 15 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ఈ-కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. రుణం కోసం నగరపాలక సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకంలో అత్యధికంగా రూ. 3.25 లక్షల వరకు లబ్ధిదారులకు రాయితీ ఇస్తారు. భూగర్భ డ్రైనేజీ క్లీనింగ్, సెప్టిక్ట్యాంక్ క్లీనర్ తదితర వాహనాలు కొనుగోలుకు మాత్రమే రుణాలు మంజూరు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పథకంపై డివిజన్ల వారీగా విస్తృత ప్రచారం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.