మియాపూర్ : చెరువులలోకి కలుషిత నీరు రాకుండా ఎస్టీపీలు ఎంతగానో ఉపయుక్తం అవుతాయని తద్వారా చెరువులు శుద్ధ జలాలతో కళకళలాడుతాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. నీటి శుద్ధి ప్లాంట్లను పకడ్బందీగా వినియోగించుకుని ఆహ్లాదకరమైన చెరువుల పరిసరాలను ప్రజలకు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా మంజూరైన 7 ఎస్టీపీలకు స్థల సేకరణ, నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై జలమండలి ఎస్టీపీ అధికారులు, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, జగదీశ్వర్ గౌడ్లతో కలసి విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం వివేకానందనగర్లోని తన నివాసంలో సమీక్షించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ ఎస్టీపీల నిర్మాణాలకు గాను స్థల సేకరణ నిమిత్తం మంగళవారం నుంచి సంబంధిత విభాగాల అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. చెరువులలోకి కలుషిత నీరు రాకుండా వాటిని ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి పరిశుభ్రమైన నీరు చెరువులలోకి వదులుతామన్నారు.
స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా నిర్మాణ ప్రక్రియను చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని విప్ గాంధీ పేర్కొన్నారు. సంబంధిత విభాగపు అధికారులు సైతం ఈ ప్రక్రియలో ఏమాత్రం జాప్యం లేకుండా చూడాలని సూచించారు. నియోజకవర్గానికి 7 ఎస్టీపీలను మంజూరు చేయటం పట్ల విప్ గాంధీ సీఎం కేసీఆర్, కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎస్టీపీ డీఈ దీపాలి, డీఈ రజని పాల్గొన్నారు.