కవాడిగూడ : ప్రభుత్వ పాఠశాలలకు ఎన్జీఓల సహాయం ఎంతో అవసరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ అవేకింగ్(పార) స్వచ్చంద సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో బోస్కో సేవా కేంద్రం సహకారంతో ఏర్పాటు చేసిన మెడికల్ కిట్లను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ పార సంస్థ హైదరాబాద్లోని 50 ప్రభుత్వ పాఠశాలల్లో 500 మెడికల్ కిట్లను ఇవ్వడం హర్షనీయమని అన్నారు. ఎన్జీఓలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద పిల్లలకు మెడికల్ కిట్లు ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. కరోనా నేపధ్యంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
వ్యక్తిగత శుభ్రతను పాటించాలని అన్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు శ్రద్ద చూపాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, జాతీయ యువజన పురస్కార గ్రహీత పానుగంటి మహేష్కుమార్, పార సంస్థ హైదరాబాద్ జిల్లా కో-ఆర్డీనేటర్ సుమతి, సభ్యులు వినయ్, పాఠశాల ప్రధానోపాద్యాయులు ఎం. నరేందర్ యాదవ్, ఉపాధ్యాయులు రవి, కిషోర్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.